మోదీ పోస్టు తొలగింపు వ్యవహారం.. మెటాను ప్రశ్నించనున్న కేంద్రం

Meta to be questioned by Center over removal of PM Modi post
  • మెటా ఆల్గారిథమ్‌ పనితీరుపై వివరణ కోరనున్న కేంద్రం
  • మోదీ పోస్టు తొలగింపుపై లిఖితపూర్వక సమాధానానికి డిమాండ్‌
  • క్షమాపణ పత్రం కూడా కోరే అవకాశమూ ఉన్నట్లు సమాచారం
  • ఆగస్టు 5, 6న ఐటీ శాఖతో కీలక సమావేశాలు
  • ఇన్‌స్టాగ్రామ్‌లో చిన్నారుల భద్రత అంశంపైనా చర్చ
  • ఏఐ మార్ఫింగ్‌ వీడియోల వ్యవహారంపైనా కొనసాగుతున్న దర్యాప్తు
సోషల్‌ మీడియా దిగ్గజం మెటా పనితీరుపై కేంద్ర ప్రభుత్వం మరింత దృష్టి సారించింది. సంస్థ గ్లోబల్‌ హెడ్‌ ఆఫ్‌ పబ్లిక్‌ పాలసీ జోయెల్‌ కాప్లాన్‌తో పాటు ఇన్‌స్టాగ్రామ్‌కు చెందిన అధికారిని ఆగస్టు 5న సమావేశానికి హాజరుకావాలని ఆదేశించింది. మెటా ఆల్గారిథమ్‌ ఎలా పనిచేస్తుంది? కొన్ని పోస్టులకు ఎందుకు ఎక్కువ ప్రాధాన్యం లభిస్తుందనే అంశాలపై వివరణ కోరనుంది.

కొన్ని రాజకీయ పోస్టులు, ముఖ్యంగా ప్రభుత్వాన్ని విమర్శించే కంటెంట్‌కు అసాధారణ స్థాయిలో ప్రచారం లభిస్తోందన్న ఫిర్యాదులు ప్రభుత్వానికి అందినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మెటా సిఫార్సు వ్యవస్థ, కంటెంట్‌ను విస్తృతంగా చూపించే విధానం, పోస్టుల తొలగింపులో అనుసరిస్తున్న భద్రతా చర్యలపై అధికారులు ప్రశ్నించే అవకాశం ఉంది.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పోస్టు తొలగింపును ‘సాంకేతిక లోపం’గా మెటా పేర్కొంది. దీనిపై పూర్తి లిఖితపూర్వక వివరణతో పాటు క్షమాపణ కూడా ఇవ్వాలని కేంద్రం కోరనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

ఐటీ శాఖ కార్యదర్శి ఎస్‌.కృష్ణన్‌ మాట్లాడుతూ.. ఆగస్టు 5, 6 తేదీల్లో మెటా ప్రతినిధులతో సమావేశాలు జరుగుతాయని చెప్పారు. భారత చట్టాల అమలు, నిబంధనల వర్తింపు, కృత్రిమ మేధతో రూపొందించిన కంటెంట్‌, ప్రముఖుల ఖాతాలకు సంబంధించిన పోస్టుల తొలగింపులో తీసుకునే జాగ్రత్తలపై చర్చిస్తామని వెల్లడించారు.

జులై 23న ప్రధానమంత్రి మోదీ విద్యార్థుల నిరసనలపై స్పందిస్తూ పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పిన సెల్ఫీ వీడియోను ఫేస్‌బుక్‌ కొంతసేపు తొలగించింది. తర్వాత సాంకేతిక లోపం వల్లే అలా జరిగిందంటూ మెటా ఆ వీడియోను పునరుద్ధరించి క్షమాపణ చెప్పింది. అయితే ఆ వివరణను కేంద్రం నిశితంగా పరిశీలిస్తోంది.

ప్రధానమంత్రి మోదీకి సంబంధించిన ఏఐ మార్ఫింగ్‌ వీడియోలు ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో వ్యాపించడంపైనా విచారణ కొనసాగుతోంది. ఈ వ్యవహారంలో మెటా ఇండియా అధిపతి అరుణ్‌ శ్రీనివాస్‌తో పాటు మరికొందరిపై హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఆ వీడియోల మూలం, వాటి వ్యాప్తి, మెటా భద్రతా వ్యవస్థ పనితీరుపై దర్యాప్తు కొనసాగుతోంది.
Advertisement
Meta
Narendra Modi
IT Ministry
Social Media Algorithms
Content Moderation
AI Morphed Videos

More Telugu News