గోద్రెజ్ బీరువా నుంచి సిప్ దాకా.. తొలి జీతం చెప్పే ఆర్థిక పాఠాలు!

First Salary financial lessons from Godrej cupboards to modern SIPs
  • తొలి జీతంపై మారిన తరాల ప్రాధాన్యతలను తెలిపే ఆసక్తికర కథనం
  • ఒకప్పుడు గోద్రెజ్ బీరువాల్లో సంపద 
  • తర్వాతి తరం ఎఫ్‌డీలు, ఎల్ఐసీలతో భద్రతకు పెద్దపీట
  • బాధ్యతతో పాటు సిప్‌లతో సంపద సృష్టిపై నేటి యువతరం దృష్టి
‘మీ మొదటి జీతంతో ఏం చేశారు?’.. ఇది చాలా సాధారణ ప్రశ్నలా అనిపించినా, జీవితకాలపు జ్ఞాపకాలను మన కళ్లముందు నిలుపుతుంది. ఈ ఒక్క ప్రశ్నకు దొరికే సమాధానాలు, కొన్ని దశాబ్దాలుగా భారతీయుల ఆర్థిక ప్రాధాన్యతలు, డబ్బుతో వారికున్న సంబంధం ఎలా మారిందో స్పష్టంగా వివరిస్తాయి. గోద్రెజ్ బీరువాలో డబ్బు దాచుకున్న తరం నుంచి, జీతం రాగానే సిప్ చేసే నేటి తరం వరకు ఈ ప్రయాణం ఎంతో ఆసక్తికరంగా సాగింది.

సంపదను కాపాడుకున్న తరం
95 ఏళ్ల ప్రీత్‌పాల్ కౌర్ సేథి జ్ఞాపకాల ప్రకారం.. ఒకప్పుడు కుటుంబ సంపద అంటే మ్యూచువల్ ఫండ్స్ కాదు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు అంతకన్నా కాదు. వారి సంపదనంతా గోద్రెజ్ బీరువా లాకర్‌లో భద్రంగా ఉండేది. కట్టలకొద్దీ నోట్లు, బట్టలో చుట్టిన బంగారు ఆభరణాలే వారికి ఆర్థిక భద్రత. ఆ తరం సంపదను పెంచడం కంటే, దాన్ని కాపాడుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది.

భారతీయ రైల్వేలో పనిచేసి రిటైరైన 91 ఏళ్ల విద్యాసాగర్ శర్మ తన తొలి జీతం అందుకున్న రోజును గుర్తుచేసుకుంటూ, "నాకు బాధ్యత పెరిగినట్లు అనిపించింది" అన్నారు. ఆయన ఆ డబ్బును నేరుగా తన తల్లిదండ్రుల చేతిలో పెట్టారు. ఆ రోజుల్లో సంపాదన అనేది వ్యక్తిగత విజయం కాదు, కుటుంబ విజయం. కుటుంబ ఖర్చులు, పిల్లల చదువులకే తొలి ప్రాధాన్యం ఉండేది.

భద్రతకు పెద్దపీట వేసిన తరం
తర్వాతి తరంలో ఆర్థిక క్రమశిక్షణ, భద్రతకు ప్రాధాన్యం పెరిగింది. 70 ఏళ్ల రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ తన అనుభవాన్ని పంచుకున్నారు. ఐదుగురు తోబుట్టువులలో పెద్దవాడైన ఆయన.. తన తొలి జీతాన్ని తల్లిదండ్రులకు ఇచ్చి, అందులోంచి కొద్ది మొత్తాన్ని "పాకెట్ మనీ"గా తీసుకునేవారు. ఆ తరంలో ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డీ) చేయడం, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్లు (ఎన్ఎస్‌సీ) కొనడం, ఎల్ఐసీ పాలసీ తీసుకోవడం ఒక సంప్రదాయంగా ఉండేది. అధిక రాబడి కంటే మూలధనాన్ని కాపాడుకోవడమే ముఖ్యమని వారు భావించారు.

బాధ్యత, పెట్టుబడిని బ్యాలెన్స్ చేస్తున్న తరం
నేటి యువతరం ఆలోచనలు భిన్నంగా ఉన్నాయి. విద్యాసాగర్ శర్మ మనవరాలు, 25 ఏళ్ల శ్రుతి శర్మ తన తొలి జీతం రాగానే కుటుంబానికి కొంత ఆర్థికంగా సాయం చేయాలని నిర్ణయించుకుంది. బాధ్యతకు విలువ ఇస్తూనే, పొదుపు మాత్రమే ద్రవ్యోల్బణాన్ని అధిగమించలేదని గ్రహించింది. అందుకే, మ్యూచువల్ ఫండ్స్, సిప్‌లను తన ఆర్థిక ప్రయాణంలో భాగం చేసుకుంది. "మా తాతల తరం సంపదను కాపాడుకుంది. మా తల్లిదండ్రులు క్రమశిక్షణతో పొదుపు చేశారు. మా తరానికి మెరుగైన పెట్టుబడి మార్గాలతో సంపదను సృష్టించే అవకాశం ఉంది" అని ఆమె వివరించింది.

తొలి జీతం తాలూకు ఆనందం, గర్వం తరాలు మారినా అలాగే ఉన్నాయి. కానీ, ఆ డబ్బుతో ఏం చేయాలనే ఆలోచన మాత్రం మారింది. గోద్రెజ్ బీరువాలో నగదు నుంచి ప్రతి నెలా ఆటోమేటిక్‌గా కట్ అయ్యే సిప్ వరకు.. భారతీయుల ఆర్థిక ప్రయాణం ఎంతో పరిణతి చెందింది.
Advertisement
First Salary
Financial Planning
Godrej Cupboard
Systematic Investment Plan
Wealth Creation
Indian Savings Habits

More Telugu News