కోడికత్తి శ్రీనుకు ఒక న్యాయం.. సీదిరి అప్పలరాజు కొడుక్కి ఒక న్యాయమా?: అనిత

Vangalapudi Anita slams Seediri Appalaraju over Palasa accident and son involvement
  • పలాస ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుందన్న అనిత
  • సీదిరి కొడుకును పిల్లోడని అంటున్నారని మండిపాటు
  • అనాటికి కోడికత్తి శ్రీను వయసు ఎంతని ప్రశ్న
కోడికత్తి శ్రీనుకు ఒక న్యాయం.. మాజీ మంత్రి కొడుక్కి ఒక న్యాయమా? అని హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత ప్రశ్నించారు. గురువారం విజయనగరంలో మీడియాతో మాట్లాడుతూ, పలాస ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుందని తెలిపారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తన కొడుకును రక్షించుకోవడానికి పడిన తపన.. ప్రమాదంలో తీవ్ర గాయాలు పాలైన వ్యక్తిని ఆసుపత్రికి తీసుకువెళ్లడంలో చూపలేదన్నారు. 

“ఆరవ్ వర్మ పిల్లోడన్నారు.. మరి కోడి కత్తి శ్రీను వయస్సు ఆనాటికి ఎంత? కోడి కత్తి శ్రీనును జైల్లో ఎన్ని రోజులు పెట్టారు. అప్పుడు పాపం పిల్లోడు అని అనిపించలేదా?” అని అనిత ప్రశ్నించారు. బాధితులను పరామర్శించేందుకు మంత్రి నారా లోకేశ్ వెళ్లినప్పుడు కనీసం ఫొటో కూడా దిగరని... అదే జగన్ వస్తే ఊరేగింపులు, బలప్రదర్శనలు.. జై కొట్టటం ఏంటని మండిపడ్డారు. 

జగన్ ప్రభుత్వం హయాంలో ఒక్క మత్స్యకారుడికైనా న్యాయం జరిగిందా? అని ఆమె నిలదీశారు.“బోటు గల్లంతైన విషయం తెలిసిన వెంటనే ప్రభుత్వం స్పందించి నేవీ అధికారులను అప్రమత్తం చేసింది. అప్పటికప్పుడు కాకినాడ నుంచి ప్రత్యేక మెరైన్ బోటును తెప్పించి గాలింపు చేపట్టాం. రెండు నేవీ హెలికాప్టర్లతో 72 గంటలపాటు సముద్రాన్ని జల్లెడపట్టాం. మత్స్యకారుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ప్రభుత్వం అందజేసింది” అని వివరించారు. 45 రోజుల్లో ప్రధాని మోదీ చేతుల మీదుగా భోగాపురం విమానాశ్రయం ప్రారంభం అవుతుందని మంత్రి తెలిపారు.
Advertisement
Vangalapudi Anita
Seediri Appalaraju
Kodi Kathi Srinu
Palasa accident
Andhra Pradesh Home Minister
Bhogapuram Airport

More Telugu News