డాక్టర్ కిరణ్ హత్య కేసులో వెలుగులోకి ఐదు షాకింగ్ నిజాలు!

Dr Priyanka scrolls phone as husband Dr Kiran lies dead and son struggles for life
  • నిద్రపోతున్న సమయంలోనే భర్త, కొడుకుపై ప్రియాంక దాడి
  • హత్య చేసిన తర్వాత కూడా శవం పక్కనే గంటల తరబడి ఫోన్ చూస్తూ కాలక్షేపం
  • తనకు తాను ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకుని ఆత్మహత్యాయత్నం
  • తీవ్ర గాయాల నుంచి కోలుకుని క్షేమంగా బయటపడ్డ ఎనిమిదేళ్ల చిన్నారి
కర్ణాటకలోని ధార్వాడ్ నగరంలో జరిగిన అనస్థీషియాలజిస్ట్ డాక్టర్ కిరణ్ హొన్నన్నవర్ దారుణ హత్య ఉదంతంలో వణికించే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసును దర్యాప్తులో ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న విషయాలు పోలీసులను దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. నేత్ర వైద్యురాలైన భార్య ప్రియాంక.. తన భర్తను హతమార్చి, ఎనిమిదేళ్ల కుమారుడిని అంతమొందించేందుకు ప్రయత్నించిన తీరు వెనుక వెలుగుచూసిన ఆ ఐదు షాకింగ్ నిజాలు ఇవే..

శవం పక్కనే ‘మొబైల్’ కాలక్షేపం!
హత్య జరిగిన తర్వాత సాధారణంగా ఎవరైనా భయపడటం లేదా పారిపోవడానికి ప్రయత్నించడం సహజం. కానీ, ఈ కేసులో నిందితురాలు ప్రియాంక ప్రవర్తించిన తీరు దర్యాప్తు అధికారులను సైతం విస్మయానికి గురిచేసింది. పడకగదిలో భర్త కిరణ్ రక్తపు మడుగులో శవమై పడి ఉన్నాడు.. పక్కనే ఎనిమిదేళ్ల కొడుకు నిహిత్ కత్తిపోట్లతో ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతున్నాడు. కానీ, ప్రియాంక మాత్రం అదే బెడ్‌పై కూర్చుని ఏమీ ఎరగనట్లు గంటల తరబడి మొబైల్ ఫోన్ స్క్రోల్ చేస్తూ కాలక్షేపం చేసింది. పోలీసులు లోపలికి వెళ్లేసరికి కూడా ఆమె అదే స్థితిలో ఉంది.

నిద్రలో ఉండగానే దారుణం
భర్తతో జరిగిన చిన్నపాటి గొడవ మనసులో పెట్టుకున్న ప్రియాంక, వారు గాఢ నిద్రలో ఉన్న సమయాన్ని ఎంచుకుంది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత భర్త, కొడుకు నిద్రపోతుండగా విచక్షణ రహితంగా కత్తితో వారిపై దాడి చేసింది. కిరణ్ నిద్రలోనే ప్రాణాలు కోల్పోగా, చిన్నారి నిహిత్ గట్టిగా కేకలు వేయడంతో ఇంట్లోని నిశ్శబ్దం ఒక్కసారిగా చెదిరిపోయింది.

ఇన్సులిన్‌తో ఆత్మహత్యాయత్నం
హత్యకు పాల్పడిన తర్వాత బెడ్‌రూమ్‌లోనే ఉన్న పలు రకాల మందులు, ఇంజెక్షన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు పట్టుబడతాననే భయంతో ప్రియాంక తనకు తానుగా భారీ మోతాదులో ఇన్సులిన్ ఇంజెక్షన్ చేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది. దీనివల్ల ఆమె శరీరంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పడిపోయి (హైపోగ్లైసీమియా) స్పృహతప్పిన స్థితికి చేరుకుంది. ప్రస్తుతం ఆమె హుబ్బళ్లిలోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

క్షేమంగా బయపటడిన చిన్నారి!
ఈ ఘోర కలిలో అందరికీ ఊరటనిచ్చే ఏకైక విషయం ఏమిటంటే.. ఎనిమిదేళ్ల బాలుడు నిహిత్ ప్రాణాలతో బయటపడటం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునేసరికి బాలుడు తీవ్ర రక్తస్రావంతో శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడు. అధికారులు సమయస్ఫూర్తితో స్పందించి తక్షణమే ఆసుపత్రికి తరలించడంతో, ప్రస్తుతం ఆ చిన్నారి కోలుకుని క్షేమంగా ఉన్నట్లు హుబ్బళ్లి-ధార్వాడ్ పోలీస్ కమిషనర్ ఎన్.శశికమార్ ప్రకటించారు.

ఇంకా అంతుచిక్కని అసలు కారణం!
నిందితురాలు ప్రియాంక కూడా వైద్యురాలే అయినప్పటికీ, ఒక సుశిక్షితురాలైన డాక్టర్ ఇలాంటి ఘాతుకానికి ఎందుకు ఒడిగట్టిందనేది ఇంకా మిస్టరీగానే ఉంది. కుటుంబ కలహాలే కారణమని ప్రాథమికంగా భావిస్తున్నప్పటికీ.. ఇంతటి తీవ్ర స్థాయి ద్వేషం వెనుక ఉన్న అసలు కారణాలు ఏమిటనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఆమె మాట్లాడే స్థితిలో లేకపోవడంతో, వైద్యుల అనుమతి లభించిన వెంటనే ఆమెను కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు పోలీసులు సర్వసిద్ధంగా ఉన్నారు.
Dr Priyanka
Dr Kiran Honnannavar
Dharwad murder case
Karnataka crime news
Doctor murder case
Anesthesiologist murder

More Telugu News