నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ ఫలితాలు విడుదల.. 11.21 లక్షల మంది అర్హత

NEET UG 2026 re exam results released 1121 lakh students qualified
  • పేపర్ లీక్ కారణంగా నీట్ యూజీ రీ ఎగ్జామ్ నిర్వాహణ
  • నేడు ఫలితాలు విడుదల 
  • పంజాబ్, హర్యానాకు చెందిన ఇద్దరు విద్యార్థులకు 720కి 715 మార్కులు
  • ఫలితాలకు ముందు తుది ఆన్సర్ కీని కూడా రిలీజ్ చేసిన ఎన్టీఏ
  • అక్రమాల ఆరోపణలతో మే 3న జరిగిన పరీక్ష రద్దు
దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తున్న నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామినేషన్ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) గురువారం ప్రకటించింది. ఈ పరీక్షలో మొత్తం 11.21 లక్షల మంది విద్యార్థులు మెడికల్ అడ్మిషన్లకు అర్హత సాధించారు. మే 3న జరిగిన అసలు పరీక్షలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో, జూన్ 21న తిరిగి పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే.

ఈ ఫలితాల్లో పంజాబ్‌కు చెందిన ఆర్యన్ గుప్తా, హర్యానాకు చెందిన పాన్షుల్ బన్సల్ ఇద్దరూ 720కి 715 మార్కులు సాధించి టాపర్లుగా నిలిచారు. అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, పుట్టినతేదీ లేదా పాస్‌వర్డ్‌తో అధికారిక వెబ్‌సైట్ neet.nta.nic.inలో లాగిన్ అయి స్కోర్‌కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫలితాల విడుదలకు కొన్ని గంటల ముందు రీ-ఎగ్జామ్‌కు సంబంధించిన తుది ఆన్సర్ కీని కూడా ఎన్టీఏ విడుదల చేసింది.

అర్హత సాధించిన వారిలో 58 శాతానికి పైగా మహిళా అభ్యర్థులే ఉన్నారని ఎన్టీఏ తెలిపింది. టాపర్లలో అత్యధికులు 17 నుంచి 19 ఏళ్ల వయసు వారే ఉన్నారు. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, తమిళనాడుతో పాటు తెలంగాణ నుంచి కూడా విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించారు.

ఫలితాలను సకాలంలో ప్రకటించడం వల్ల మెడికల్ అడ్మిషన్లు, కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను సజావుగా కొనసాగించడానికి వీలవుతుందని ఎన్టీఏ ఒక ప్రకటనలో పేర్కొంది. విద్యార్థుల సౌలభ్యం కోసం స్కాన్ చేసిన ఓఎంఆర్ షీట్లు, స్కోర్‌కార్డులను డిజిలాకర్‌లో కూడా అందుబాటులో ఉంచినట్లు వెల్లడించింది.


Advertisement
NEET UG 2026
NTA
NEET Re-exam Results
Aryan Gupta
Panshul Bansal
Medical Entrance Exam

More Telugu News