యూపీలో ఆస్తి కోసం దారుణం.. తండ్రినే కాల్చి చంపిన కొడుకు!

Nikhil shoots father dead over property dispute in Ghaziabad
  • ఘజియాబాద్‌లో ఆస్తి వివాదంతో తండ్రిని కాల్చి చంపిన కొడుకు
  • రూ.150 కోట్ల ఆస్తిపరుడైన హరిఓం చౌదరిని హత్య చేసిన కుమారుడు నిఖిల్
  • మద్యం మత్తులో గొడవపడి తండ్రిపై పలుమార్లు కాల్పులు జరిపిన నిందితుడు
  • పరారీలో నిందితుడు
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో అత్యంత దారుణమైన ఘటన వెలుగుచూసింది. ఆస్తి వివాదాల నేపథ్యంలో కన్న తండ్రినే ఓ కుమారుడు తుపాకీతో కాల్చి చంపాడు. మోదీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బుదానా గ్రామంలో బుధవారం రాత్రి ఈ ఘాతుకం చోటుచేసుకుంది. సుమారు రూ. 150 కోట్ల విలువైన ఆస్తులు కలిగిన హరిఓం చౌదరి (55) అనే వ్యక్తిని ఆయన పెద్ద కుమారుడు నిఖిల్ (32) దారుణంగా హత్య చేశాడు.

పోలీసుల కథనం ప్రకారం, బుధవారం రాత్రి నిఖిల్ మద్యం మత్తులో ఆలస్యంగా ఇంటికి రావడంతో తండ్రి అతడిని మందలించారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఆగ్రహంతో ఊగిపోయిన నిఖిల్, తన వద్ద ఉన్న తుపాకీతో తండ్రి ముఖం, ఛాతీ, పొట్ట భాగాల్లో పలుమార్లు కాల్పులు జరిపాడు. అనంతరం ఆయుధంతో సహా అక్కడి నుంచి పరారయ్యాడు. కుటుంబ సభ్యులు హరిఓంను వెంటనే ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

నిందితుడు నిఖిల్‌కు మద్యపానం అలవాటు ఉందని, ఆస్తి కోసం తరచూ తండ్రితో గొడవపడేవాడని విచారణలో తేలింది. హరిఓం గతంలోనే తన కుమారుడికి 25 బీగాల భూమి, కొన్ని దుకాణాలు ఇచ్చారు. అయినప్పటికీ మరిన్ని ఆస్తులు కావాలని నిఖిల్ తండ్రిపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో 2018లో నిఖిల్ తన తమ్ముడు నీషుపై కూడా కాల్పులకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఏసీపీ భాస్కర్ వర్మ వెల్లడించారు.
Advertisement
Nikhil
Hariom Chaudhary
Ghaziabad crime
Property dispute murder
Uttar Pradesh
Modinagar police

More Telugu News