కమ్మ కార్పొరేషన్ ఛైర్మన్ బ్రహ్మం చౌదరి త్వరగా కోలుకోవాలి: నారా లోకేశ్
- బ్రెయిన్ స్ట్రోక్కు గురైన బ్రహ్మం చౌదరి
- తాడేపల్లి మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స
- బ్రహ్మం చౌదరి భార్య శ్వేతను పరామర్శించిన లోకేశ్
ఆంధ్రప్రదేశ్ కమ్మ కార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరి అకస్మాత్తుగా బ్రెయిన్ స్ట్రోక్కు గురై తాడేపల్లిలోని మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. తాజాగా ఎక్స్ వేదికగా స్పందిస్తూ... బ్రహ్మం చౌదరి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
కొన్ని రోజుల క్రితమే బ్రహ్మం చౌదరి, గౌతమి శ్వేతల వివాహం వైభవంగా జరిగింది. ఈ కొత్త జంట పెళ్లి వేడుకకు మంత్రి నారా లోకేశ్ స్వయంగా హాజరై ఆశీర్వదించారు. పెళ్లయిన కొద్ది రోజులకే ఆయన ఇలా తీవ్ర అస్వస్థతకు గురికావడం పట్ల లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు.
బ్రహ్మం చౌదరి భార్య గౌతమీ శ్వేతను ఫోన్లో పరామర్శించానని లోకేశ్ తెలిపారు. "అండగా ఉంటామని, ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చాను. మణిపాల్ వైద్యులతో మాట్లాడి బ్రహ్మం చౌదరి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నాను. త్వరగా కోలుకునేలా మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరాను. ఆయనకు ఎలాంటి లోటు లేకుండా అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని, త్వరగా కోలుకునేలా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని వైద్య బృందాన్ని కోరాను" అని లోకేశ్ వివరించారు.