ప్రభుత్వాలను ఎదిరించి నిలిచిన ధీశాలి ముద్రగడ: వెల్లంపల్లి

Mudragada Padmanabham was a brave leader who stood against governments says Vellampalli
  • విజయవాడలో ముద్రగడ సంతాప సభ
  • ఎక్కడా లొంగిపోని మనస్తత్వం ముద్రగడదన్న వెల్లంపల్లి
  • ముద్రగడకు జరిగిన అన్యాయంపై పవన్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్న
మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మృతిపై విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ముద్రగడ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ, చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు మంత్రిగా సేవలందించిన గొప్ప నేత ముద్రగడని ప్రశంసించారు. ప్రభుత్వాలను ఎదిరించి నిలిచిన ధీశాలి అని, ఎక్కడా లొంగిపోని మనస్తత్వం ఆయనదని కొనియాడారు.

కాపు రిజర్వేషన్ల కోసం పోరాడిన ముద్రగడపై గతంలో అక్రమ కేసులు బనాయించారని విమర్శించారు. అప్పట్లో ముద్రగడను పలకరించడానికి వచ్చిన చిరంజీవి, దాసరి నారాయణరావులను ఎయిర్‌పోర్ట్ నుంచే వెనక్కి పంపడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ముద్రగడకు జరిగిన అన్యాయంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. ముద్రగడ పద్మనాభం ఆశయాలు, ఆలోచన విధానాన్ని వైసీపీ ముందుకు తీసుకెళుతుందని వెలంపల్లి స్పష్టం చేశారు. ఈ సంతాప సభలో వైసీపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ముద్రగడ మరణం తెలుగు రాష్ట్రాల రాజకీయాలకు, సామాజిక ఉద్యమాలకు తీరని లోటని అందరూ వ్యాఖ్యానించారు.
Advertisement
Mudragada Padmanabham
Vellampalli Srinivas
Kapu Reservation
YSRCP
Andhra Pradesh Politics
Pawan Kalyan

More Telugu News