పవన్ కల్యాణ్ రెండు భుజాలకు సర్జరీ.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన చంద్రబాబు
- రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ తో బాధపడుతున్న పవన్
- ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో శస్త్రచికిత్స
- మూడు గంటల పాటు కొనసాగిన ఆపరేషన్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ రెండు భుజాలకు సంబంధించిన శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. ఈ విషయం తెలిసిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందిస్తూ... పవన్ కల్యాణ్ త్వరగా, పూర్తి ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు.
మూడు గంటల పాటు సర్జరీ: పవన్ కల్యాణ్కు రెండు భుజాలకు 'రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్' ఉన్నట్లు ఇటీవల చేసిన మెడికల్ టెస్టుల్లో తేలింది. దీనికి సర్జరీనే ఏకైక మార్గమని ముంబైలోని ప్రముఖ కోకిలాబెన్ ఆస్పత్రి వైద్యులు తేల్చి చెప్పడంతో ఆయన శస్త్రచికిత్సకు సిద్ధమయ్యారు. వైద్యుల షెడ్యూల్ ప్రకారం శనివారం ఆయనకు దాదాపు మూడు గంటల పాటు ఆపరేషన్ నిర్వహించారు.
పవన్ కల్యాణ్కు సర్జరీ జరిగిన విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా స్పందించారు. "గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పూర్తి స్థాయిలో, వేగంగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను" అంటూ ఒక ఆత్మీయ పోస్ట్ చేశారు.
ప్రస్తుతం పవన్ కల్యాణ్ వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నారు. ఆయన సర్జరీ విజయవంతం కావడం పట్ల జనసైనికులు, కూటమి నాయకులు, కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.