రైల్వే ట్రాక్‌పై 25,000 వోల్టుల కరెంట్ వైర్ల చోరీ.. బీహార్‌లో 3 గంటల పాటు నిలిచిన రైళ్లు!

Bihar thieves steal 25000 volt railway wires causing 3 hour train delay
  • బీహార్‌లో మరోసారి రెచ్చిపోయిన దొంగలు
  • 25,000 వోల్టుల విద్యుత్ ప్రవహించే ఓవర్ హెడ్ వైర్ల చోరీ
  • పట్నా-గయా మార్గంలో మూడు గంటల పాటు నిలిచిన రైళ్లు
  • సమీపంలోని గుంతలో దాచిన వైర్లను స్వాధీనం చేసుకున్న ఆర్పీఎఫ్
  • నిందితుల కోసం గాలింపు, కేసు నమోదు చేసి దర్యాప్తు
బీహార్‌లో దొంగలు మరోసారి అసాధారణ చోరీతో అధికారులను నివ్వెరపరిచారు. ఏకంగా 25,000 వోల్టుల విద్యుత్ ప్రవహించే రైల్వే ఓవర్ హెడ్ ఎలక్ట్రిక్ వైర్లనే కట్ చేసి ఎత్తుకెళ్లారు. జెహానాబాద్ జిల్లా పరిధిలోని పట్నా-గయా రైల్వే సెక్షన్‌లో గురువారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఊహించని దొంగతనంతో కీలకమైన ఈ మార్గంలో రైళ్ల రాకపోకలకు సుమారు మూడు గంటల పాటు అంతరాయం ఏర్పడింది.

తూర్పు మధ్య రైల్వే (ఈసీఆర్) అధికారుల వివరాల ప్రకారం.. తెల్లవారుజామున 3 గంటల సమయంలో తెహతా - జెహానాబాద్ స్టేషన్ల మధ్య ఉన్న ఉంతా-మదర్‌పూర్ వద్ద ఈ చోరీ జరిగింది. డౌన్ లైన్‌లో దొంగలు ఓవర్ హెడ్ వైర్లను కట్ చేయడంతో ఆ సెక్షన్‌కు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సాంకేతిక లోపం గుర్తించిన రైల్వే అధికారులు వెంటనే అప్రమత్తమై రైళ్లను ఎక్కడికక్కడ నిలిపివేశారు. సమాచారం అందుకున్న రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్), ఇంజనీరింగ్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు.

ఈ దొంగతనం జరిగిన ప్రాంతానికి అత్యంత సమీపంలోనే ఆర్పీఎఫ్ పోస్ట్, గవర్నమెంట్ రైల్వే పోలీస్ (జీఆర్పీ) స్టేషన్ ఉన్నాయి. అంతటి భద్రత ఉన్నప్పటికీ, లైన్‌లో సాంకేతిక లోపం తలెత్తే వరకు ఈ చోరీ విషయం అధికారుల దృష్టికి రాకపోవడం గమనార్హం. ఆర్పీఎఫ్ బృందాలు అక్కడికి చేరుకునేసరికే దొంగలు పరారయ్యారు. అయితే, ఆ ప్రాంతంలో గాలించగా, కట్ చేసిన విద్యుత్ వైర్లను దొంగలు సమీపంలోని ఓ గుంతలో దాచిపెట్టినట్లు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు.

దెబ్బతిన్న ఓవర్ హెడ్ పరికరాలను, సిగ్నలింగ్ వ్యవస్థను రైల్వే సాంకేతిక సిబ్బంది పునరుద్ధరించారు. ఉదయం 4 గంటల నుంచి 7 గంటల వరకు రైళ్ల రాకపోకలు నిలిచిపోగా, ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా డౌన్ లైన్ రైళ్లను అప్ లైన్ ద్వారా (సింగిల్ లైన్ వర్కింగ్) నెమ్మదిగా పంపించారు. ఈ ఘటనపై తూర్పు మధ్య రైల్వే సీపీఆర్వో సరస్వతి చంద్ర స్పందిస్తూ.. దొంగిలించిన వైర్లను స్వాధీనం చేసుకున్నామని, నిందితులను గుర్తించి అరెస్ట్ చేయడానికి ఆర్పీఎఫ్ విచారణ ప్రారంభించిందని తెలిపారు. 
Advertisement
Bihar Railways
Railway overhead wire theft
Patna Gaya railway section
East Central Railway
Jehanabad railway incident
Train delays in Bihar

More Telugu News