ఏపీపై తెలంగాణ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఫోకస్.. తిరుపతిలో కొత్త వర్సిటీ

Malla Reddy focus on Andhra Pradesh with new university in Tirupati
  • ఏపీలో విద్యాసంస్థల విస్తరణకు మల్లారెడ్డి శ్రీకారం
  • తిరుపతిలో మల్లారెడ్డి డీమ్డ్ యూనివర్సిటీ ఏర్పాటు
  • వర్సిటీ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి
  • తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం కీలక ప్రకటన
  • గతేడాది తిరుపతి, విశాఖలో కాలేజీలు కొనుగోలు చేసిన మల్లారెడ్డి
తెలంగాణకు చెందిన ప్రముఖ విద్యావేత్త, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి.. ఏపీలో తన విద్యాసంస్థల సామ్రాజ్యాన్ని విస్తరించే దిశగా కీలక అడుగు వేశారు. తిరుపతిలో 'మల్లారెడ్డి డీమ్డ్ యూనివర్సిటీ'ని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన అధికారికంగా ప్రకటించారు. ఈ వర్సిటీ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు లభించాయని తిరుమలలో వెల్లడించారు.

నిన్న‌ ఉదయం శ్రీవాణి ట్రస్ట్ దాతగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మల్లారెడ్డి మీడియాతో మాట్లాడారు. గత 35 ఏళ్లుగా విద్యా రంగంలో సేవలు అందిస్తున్నానని, తిరుపతిలో యూనివర్సిటీ స్థాపించాలన్న తన చిరకాల కల నెరవేరిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. 2025లోనే ఈ ఆలోచన చేశానని, శ్రీవారి దయతో ఇప్పుడు అది కార్యరూపం దాల్చిందని తెలిపారు.

తెలంగాణలో ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలు, డీమ్డ్ యూనివర్సిటీలతో బలమైన నెట్‌వర్క్‌ను నిర్మించుకున్న మల్లారెడ్డి, ఇప్పుడు ఇతర రాష్ట్రాలపైనా దృష్టి సారించారు. ఇందులో భాగంగానే ఆయన గతేడాది తిరుపతిలో ఒక ఇంజనీరింగ్ కళాశాలను కొనుగోలు చేశారు. అదే ఏడాది నవంబర్‌లో విశాఖపట్నంలోనూ మరో కళాశాలను కొనుగోలు చేసినట్లు గతంలోనే వెల్లడించారు. శ్రీవారి ఆశీస్సులతో దేశవ్యాప్తంగా విద్యాసంస్థలను ఏర్పాటు చేయాలన్నది తన ఆకాంక్ష అని పేర్కొన్నారు.

పాల వ్యాపారంతో జీవితం ప్రారంభించి, విద్యావేత్తగా, రాజకీయ నాయకుడిగా ఉన్నత స్థాయికి ఎదిగిన మల్లారెడ్డి, ఇప్పుడు తన 'మల్లారెడ్డి' బ్రాండ్‌ను ఏపీకి విస్తరిస్తున్నారు. అయితే, గతేడాది కొనుగోలు చేసిన కాలేజీ ప్రాంగణంలోనే ఈ డీమ్డ్ వర్సిటీని అభివృద్ధి చేస్తారా? లేక కొత్త ప్రాంగణాన్ని ఎంచుకుంటారా? అనే దానిపై రానున్న రోజుల్లో స్పష్టత రానుంది.
Advertisement
Malla Reddy
Malla Reddy Deemed University
Tirupati
Andhra Pradesh
Medchal MLA
University Expansion

More Telugu News