పోక్సో కేసు పెట్టారనే కక్షతో ఊచకోత.. కన్నబిడ్డలు, భార్య సహా ఆరుగురిని చంపేసిన కిరాతకుడు!

Rajkumar kills six including children and wife over POCSO case grudge
  • రంగారెడ్డి జిల్లా షాబాద్‌ మండలం దైవాలగూడలో ఘటన
  • బెయిల్‌పై వచ్చి నిద్రపోతున్న వారిపై దాడి
  • సొంత బిడ్డలనూ వదలని కిరాతకుడు
  • హత్యల విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పిన నిందితుడు
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో శనివారం తెల్లవారుజామున దారుణం జరిగింది. మండల కేంద్రంలోని దైవాలగూడ గ్రామంలో రాజ్‌కుమార్ (28) అనే వ్యక్తి కక్షతో రగిలిపోతూ ఏకంగా ఆరుగురిని అతి కిరాతకంగా హత్య చేశాడు. ఒకేసారి ఆరుగురు వ్యక్తులు నెత్తుటి మడుగులో శవాలుగా మారిన ఈ ఉదంతం స్థానికంగా తీవ్ర సంచలనం రేకెత్తించింది.

పోలీసుల కథనం ప్రకారం.. గతంలో ఒక బాలికను వేధించాడనే ఆరోపణలపై బాధితురాలు, ఆమె తల్లి మే 16న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రాజ్‌కుమార్‌పై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఇటీవల బెయిల్‌పై జైలు నుండి బయటకు వచ్చిన రాజ్‌కుమార్.. తనపై కేసు పెట్టారన్న కక్షను పెంచుకున్నాడు. ఈ క్రమంలో శనివారం తెల్లవారుజామున నిద్రపోతున్న బాధితులపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి ఊచకోత కోశాడు.

ఈ దాడిలో ఫిర్యాదు చేసిన బాధిత బాలిక, ఆమె తల్లి, నానమ్మ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అంతటితో ఆగని నిందితుడు..  తన భార్య సరిత, మూడేళ్ల కుమార్తె, రెండేళ్ల కుమారుడిని కూడా అత్యంత అమానుషంగా కడతేర్చాడు. ఆరుగురిని చంపిన అనంతరం రాజ్‌కుమార్ స్వయంగా ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పాడు. కొడుకు చేసిన ఘాతుకాన్ని విని నిర్ఘాంతపోయిన తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అయితే, భార్యాపిల్లలను ఎందుకు హత్య చేశాడనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.

సైబరాబాద్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి, డీసీపీ యోగేష్ గౌతమ్ శాంతిభద్రతల విభాగం పోలీసులతో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగి ఆధారాలు సేకరించాయి. నిందితుడు రాజ్‌కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోక్సో కేసులో జైలుకు వెళ్లిన కక్షతోనే ఈ దారుణ నరమేధానికి పాల్పడినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని సీపీ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Rajkumar
Rangareddy Shabad murder
POCSO case revenge killing
Daivalaguda village massacre
Cyberabad police investigation
Six family members killed

More Telugu News