నాన్నా.. మీరే నా స్ఫూర్తి: జగన్
- తన తండ్రి జయంతి సందర్భంగా నివాళి అర్పించిన జగన్
- తన తండ్రి ఆశీస్సులే తన ధైర్యం అంటూ ట్వీట్
- మిస్ యూ నాన్నా అంటూ భావోద్వేగం
దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద వైసీపీ అధినేత జగన్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఘనంగా నివాళులర్పించారు. "మీరే నా స్ఫూర్తి.. మీ ఆశీస్సులే నా ధైర్యం.. మిస్ యూ నాన్నా" అంటూ జగన్ భావోద్వేగంతో కూడిన ట్వీట్ చేశారు. వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పిస్తున్న ఫొటోలను పంచుకున్నారు.
ఇడుపులపాయలో నిర్వహించిన వేడుకల్లో వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతితో పాటు పలువురు వైసీపీ సీనియర్ నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. నిరుపేదల సంక్షేమం, ఉచిత విద్య, వైద్యం, ఉచిత విద్యుత్, సాగునీటి ప్రాజెక్టుల ద్వారా వైఎస్సార్ చేసిన సేవలను ఈ సందర్భంగా నేతలు కొనియాడారు. ప్రజల హృదయాల్లో నిలిచిన నేతగా రాజన్న ఎప్పటికీ స్ఫూర్తిదాయకుడని వారు స్మరించుకున్నారు.