రూ.55 లక్షల జపాన్ ఉద్యోగానికి నో చెప్పిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్.. కారణమిదే!

Yashasvi Soni chooses family and work-life balance over high salary in Japan
  • అధిక వేతనం కంటే ప్రశాంత జీవనాన్నే ఎంచుకున్న జైపూర్‌ టెకీ
  • భార్య ఉద్యోగం కూడా అక్కడే ఉండడంతో రిమోట్‌ ఉద్యోగంపై మొగ్గు
  • జపాన్‌లో మళ్లీ కొత్త జీవితాన్ని ప్రారంభించాల్సి వస్తుందని వెనక్కి
  • డబ్బుల కంటే కూడా వర్క్‌-లైఫ్‌ బ్యాలెన్స్ ముఖ్యమని అభిప్రాయం
  • సరైన నిర్ణయమంటూ మద్దతు ప్రకటించిన నెటిజన్లు
జైపూర్‌కు చెందిన సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ యశస్వి సోని చేసిన ఓ లింక్డిన్‌ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఏడాదికి రూ.55 లక్షల వేతనంతో జపాన్‌లో ఉద్యోగం వచ్చినప్పటికీ, దాన్ని తిరస్కరించి భారత్‌లోనే రిమోట్ ఉద్యోగాన్ని ఎంచుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఎక్కువ జీతం కంటే కుటుంబంతో కలిసి ఉండటం, జీవితంలో స్థిరత్వం, పని-వ్యక్తిగత జీవితంలో సమతుల్యత ముఖ్యమని భావించినట్లు చెప్పారు.

రెండేళ్ల క్రితం తన కంపెనీ పూణేకు మారాలని కోరడంతో కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నించానని సోని తెలిపారు. ఈ క్రమంలో లండన్ స్టార్టప్ నుంచి రూ.37 లక్షలు, దుబాయ్ నుంచి రూ.47 లక్షలు, జపాన్ నుంచి రూ.55 లక్షలు, అలాగే ఈపీఏఎం నుంచి రూ.29 లక్షల వార్షిక వేతనంతో రిమోట్ ఉద్యోగావకాశాలు వచ్చాయని పేర్కొన్నారు. కాగితాలపై చూస్తే జపాన్ ఉద్యోగమే ఉత్తమంగా కనిపించినా, తాను నిజంగా జీవితంలో ఏమి కోరుకుంటున్నాననే ప్రశ్నకు సమాధానం వెతికానని చెప్పారు.

తన భార్యకు జైపూర్‌లో ఉద్యోగం ఉందని, ఇద్దరూ కోరుకున్న జీవితం అక్కడే ఉన్నట్లు గమనించామని వివరించారు. అలాంటి సమయంలో జపాన్‌కు వెళ్లడం అంటే కొత్త దేశం, కొత్త భాష, కొత్త జీవితం కోసం మళ్లీ మొదటి నుంచి ప్రారంభించాల్సి వస్తుందని భావించానన్నారు. దుబాయ్‌లో పన్ను రహిత వేతనం ఉన్నప్పటికీ, అక్కడి జీవనశైలి తమకు నచ్చలేదని తెలిపారు.

ఈపీఏఎంలో చేరేందుకు సిద్ధమవుతున్న సమయంలో తన ప్రస్తుత కంపెనీ నుంచి అవకాశం వచ్చిందని సోని చెప్పారు. ఇంటర్వ్యూలు పూర్తయ్యాక మరో ఉద్యోగానికి సమాధానం ఇవ్వాల్సి ఉందని నేరుగా ఇంటర్వ్యూవర్‌కు లింక్డిన్‌‌లో సందేశం పంపానని తెలిపారు. సానుకూల స్పందన రావడంతో జపాన్, దుబాయ్, ఈపీఏఎం ఉద్యోగాలను తిరస్కరించి ప్రస్తుతం జైపూర్ నుంచే పూర్తిగా రిమోట్‌గా పనిచేస్తున్నానని వెల్లడించారు.

‘‘డబ్బు జీవితంలో ముఖ్యమే. కానీ అది ఒక అంశం మాత్రమే. మనం నివసించే నగరం, మన చుట్టూ ఉన్నవారు, జీవనశైలి కూడా అంతే ముఖ్యమైనవి. కాబట్టి కేవలం ఎక్కువ జీతం కోసం కాకుండా.. మొత్తం జీవిత సమీకరణాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలి’’ అని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు. ఈ పోస్ట్‌కు నెటిజన్ల నుంచి విశేష స్పందన లభిస్తోంది. కుటుంబం, మానసిక ప్రశాంతత, రిమోట్ వర్క్‌కు ప్రాధాన్యం ఇవ్వడం సరైన నిర్ణయమని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Advertisement
Yashasvi Soni
Software Engineer
Remote Work
Japan Job Offer
Work Life Balance
Jaipur

More Telugu News