మమతా బెనర్జీ పార్టీకి ఈడీ షాక్: రూ.440 కోట్ల నిధులు ఫ్రీజ్

ED shock to Mamata Banerjee party 440 crore bank accounts frozen
  • పార్టీకి చెందిన మూడు బ్యాంకు ఖాతాల్లోని డబ్బులు ఫ్రీజ్
  • కేర్‌వెల్ ఏవియేషన్ గ్రూప్‌తో లావాదేవీలపై దర్యాప్తు
  • పార్టీ నిధులతో విమానం, హెలికాప్టర్ కొని లీజుకు తీసుకున్నట్లు ఆరోపణలు
పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గట్టి షాక్ ఇచ్చింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద ఆ పార్టీకి చెందిన మూడు బ్యాంకు ఖాతాలను ఈడీ అధికారులు స్తంభింపజేశారు. ఈ ఖాతాల్లో సుమారు రూ.440.42 కోట్ల నిధులు ఉన్నట్లు బుధవారం అధికారులు వెల్లడించారు.

ఏవియేషన్ రంగానికి చెందిన 'కేర్‌వెల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌'కు సంబంధించి జరుగుతున్న అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలపై ఈడీ సుదీర్ఘ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసు విచారణలో భాగంగా ఢిల్లీ-ఎన్‌సీఆర్, కోల్‌కతా పరిసర ప్రాంతాల్లోని ఐదు చోట్లో సోదాలు నిర్వహించిన అనంతరం ఈడీ ఈ నిర్ణయం తీసుకుంది.

ఈడీ ప్రాథమిక దర్యాప్తు వివరాలు ప్రకారం, ఏప్రిల్ 2023 నుంచి జూన్ 2026 మధ్య కాలంలో టీఎంసీకి చెందిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఖాతాల నుంచి సుమారు రూ.160 కోట్లను కేర్‌వెల్ ఏవియేషన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థలకు బదిలీ చేశారు. ఆ తర్వాత రూ.82.96 కోట్లను మరో కంపెనీకి మళ్లించినట్లు అధికారులు గుర్తించారు. ఈ నిధులతో రూ.112 కోట్ల వ్యయంతో ఒక ఎంభ్రేయర్ లీగసీ 600 విమానం, ఒక అగస్టా 109 ఎస్‌పీ హెలికాప్టర్‌ను కొనుగోలు చేసినట్లు తేలింది. వీటిని తిరిగి అధిక ధరకు టీఎంసీకే లీజుకు ఇచ్చినట్లు దర్యాప్తులో వెల్లడైంది.

ఈ లావాదేవీల తీరు అత్యంత అనుమానాస్పదంగా ఉందని, అసలు లబ్ధిదారులను గుర్తించకుండా నిధుల మళ్లింపును దాచిపెట్టేందుకే ఈ వ్యూహాన్ని అనుసరించినట్లు అధికారులు భావిస్తున్నారు. హెలికాప్టర్ కొనుగోలుకు విదేశీ నిధులు ఏమైనా వినియోగించారా అనే కోణంలోనూ దర్యాప్తు సాగుతోంది. ఇటీవల ఎన్నికల్లో ఎదురైన పరాజయాలతో అంతర్గత సవాళ్లను ఎదుర్కొంటున్న టీఎంసీకి, ఈ తాజా పరిణామం మరింత ఇబ్బందికరంగా మారింది. ఈ నిధుల మూలాలపై ఆ పార్టీకి చెందిన రెబల్ ఎమ్మెల్యేలు గతంలోనే పశ్చిమ బెంగాల్ పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం.
Advertisement
Trinamool Congress
Enforcement Directorate
Mamata Banerjee
Money Laundering Case
Carewell Aviation

More Telugu News