పైకప్పు నుంచి తోసినా చావలేదు.. చివరికి టాయిలెట్‌ క్లీనర్‌తో భర్తను చంపిన భార్య

Sandhya kills husband with toilet cleaner after he survives being pushed from roof
  • పైకప్పు నుంచి తోసినా ప్రాణాలతో బయటపడ్డ బాధితుడు
  • సెలైన్‌ పైప్‌ ద్వారా టాయిలెట్‌ క్లీనర్‌ ఎక్కించి హత్య
  • ప్రియుడు, అతడి స్నేహితుడి సహకారం
  • ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం
  • మృతుడి తల్లి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన కేసు
మొదటి ప్రయత్నంలో భవనం పైకప్పు నుంచి తోసేసినా అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. దీంతో ఆస్పత్రి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఐవీ ద్వారా టాయిలెట్‌ క్లీనర్‌, నిద్రమాత్రల పొడిని శరీరంలోకి ఎక్కించి హత్య చేసిన ఘటన తెలంగాణలోని నిజామాబాద్‌ జిల్లాలో కలకలం రేపింది. ఈ కేసులో భార్యతో పాటు ఆమె ప్రియుడు, అతడి స్నేహితుణ్ని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

మృతుణ్ని దయిని ప్రశాంత్‌ (35)గా గుర్తించారు. గత రెండేళ్లుగా గల్ఫ్‌లో పనిచేస్తున్న అతడు జూన్‌ 27న స్వగ్రామానికి వచ్చాడు. ఇక విదేశాలకు వెళ్లొద్దని నిర్ణయించుకున్నాడు. అయితే ప్రైవేట్‌ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తున్న అతడి భార్య సంధ్య (32), తన వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా మారాడని భావించింది. దీంతో ప్రియుడు అనిల్‌, అతడి స్నేహితుడు వెంకట్‌సాయి అలియాస్‌ బంటీతో కలిసి హత్యకు పథకం వేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

జూన్‌ 29న ప్రశాంత్‌కు బంటీ అధికంగా మద్యం తాగించాడు. తర్వాత సంధ్య ఫోన్‌లో చెప్పినట్లే అతణ్ని భవనం పైకప్పుపైకి తీసుకెళ్లి కిందకు తోసేశాడు. తీవ్రంగా గాయపడినప్పటికీ ప్రశాంత్‌ ప్రాణాలతో బయటపడ్డాడు. మద్యం మత్తులో ప్రమాదవశాత్తు కిందపడిపోయాడని నమ్మించి ముందుగా ప్రభుత్వ ఆస్పత్రికి, తర్వాత ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఇంటికి తీసుకొచ్చారు.

నర్సింగ్‌ శిక్షణ పొందిన సంధ్య ఇంట్లోనే ప్రశాంత్‌కు ఐవీ ఫ్లూయిడ్స్‌ ఎక్కిస్తోంది. ఇదే అవకాశంగా భావించిన ముగ్గురు నిందితులు మరోసారి హత్యకు కుట్ర పన్నారు. జూన్‌ 30న సంధ్య, టాయిలెట్‌ క్లీనర్‌తో పాటు నిద్రమాత్రల పొడిని కలిపి సెలైన్‌ ఎక్కించడానికి పెట్టే చిన్న గొట్టం ద్వారా శరీరంలోకి ఇంజెక్షన్‌తో పంపింది. తర్వాత మంచం మీద నుంచి కిందకు తోసేయడంతో ప్రశాంత్‌ మృతి చెందాడు. పైకప్పు నుంచి పడిపోవడంతో ఆరోగ్యం క్షీణించి చనిపోయినట్లు నమ్మించే ప్రయత్నం చేసింది.

అయితే ప్రశాంత్‌ తల్లి తన కుమారుడి మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుమారుడు ఇంటికి వచ్చిన విషయం కూడా తనకు తెలియదని, అతడి మరణం వెనుక అనుమానాస్పద పరిస్థితులు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు లోతుగా దర్యాప్తు చేసి హత్య కుట్రను ఛేదించారు. సంధ్య, అనిల్‌, బంటీని అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరచగా.. న్యాయస్థానం వారిని జ్యుడీషియల్‌ కస్టడీకి తరలించింది.
Advertisement
Sandhya
Nizamabad Murder Case
Toilet Cleaner Murder
Telangana Crime News
Extramarital Affair Murder
Prashanth Murder Nizamabad

More Telugu News