ఒక్కటి కూల్చితే.. వంద కడతాం: హైడ్రా నోటీసులపై అక్బరుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు!
- ఫాతిమా కాలేజ్ పేరుతో తమను భయపెట్టాలని చూస్తున్నారన్న అక్బరుద్దీన్
- తాము ఎలాంటి అవినీతికి పాల్పడలేదన్న ఎంఐఎం ఎమ్మెల్యే
- పేదల కోసం వంద విద్యాసంస్థలు నిర్మిస్తామని వ్యాఖ్య
సల్కం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించారంటూ ఫాతిమా ఒవైసీ విద్యాసంస్థలపై హైడ్రా విచారణ జరుపుతున్న నేపథ్యంలో, చాంద్రాయణగుట్ట ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ గౌస్నగర్లోని విద్యా క్యాంపస్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... ఫాతిమా కళాశాల పేరుతో తమను భయపెట్టాలని చూస్తున్నారని, తాము ఎలాంటి అవినీతికి పాల్పడలేదని స్పష్టం చేశారు.
తమ విద్యాసంస్థలను కూల్చివేస్తామంటూ వస్తున్న బెదిరింపులకు తలొగ్గే ప్రసక్తే లేదని, వాటిని ఎలా కాపాడుకోవాలో తమకు బాగా తెలుసని అక్బరుద్దీన్ హెచ్చరించారు. "ఒక్క విద్యాసంస్థను కూల్చేస్తే.. పేద ప్రజల కోసం వంద విద్యాసంస్థలను నిర్మించి చూపిస్తాం" అని ఆయన సవాల్ విసిరారు. సంస్థలు ఉన్నా లేకపోయినా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తామన్నారు.
ఈ సందర్భంగా సాలార్-ఎ-మిల్లత్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ చైర్మన్ హోదాలో 366 మంది పేద విద్యార్థుల పేరున రూ.కోటీ 19 లక్షలను ఫిక్స్డ్ డిపాజిట్ చేసి, ఉచిత పుస్తకాలను పంపిణీ చేశారు.