నీట్ విద్యార్థులకు అలర్ట్.. ఫీజు రిఫండ్కు రేపే చివరి తేదీ!
- నీట్ యూజీ 2026 ఫీజు రిఫండ్పై ఎన్టీఏ కీలక సూచన
- బ్యాంక్ వివరాల అప్డేట్ కోసం రేపు రాత్రి 11:50 గంటల వరకు గడువని ప్రకటన
- ఇప్పటికే వివరాలు అందించిన వారికి రిఫండ్ ప్రక్రియ ప్రారంభమైందని వెల్లడి
- గడువు తర్వాత వివరాల మార్పునకు ఎలాంటి అవకాశం లేదని స్పష్టీకరణ
- ఇంకా లక్షలాది మంది విద్యార్థులు వివరాలు నమోదు చేయాల్సి ఉందన్న ఎన్టీఏ
ఎన్టీఏ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. ఇప్పటివరకు కేవలం 8,29,510 మంది అభ్యర్థులు మాత్రమే అధికారిక పోర్టల్లో తమ బ్యాంక్ ఖాతా వివరాలను అప్డేట్ చేశారు. ఇంకా పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉందని ఏజెన్సీ తెలిపింది. ఇప్పటికే వివరాలను విజయవంతంగా ధ్రువీకరించిన వారికి రిఫండ్ ప్రక్రియ మొదలైందని, గడువులోగా పూర్తి చేసిన వారిని తదుపరి దశలో పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచించింది.
వివరాలు ఎలా అప్డేట్ చేయాలి?
- అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్సైట్ neet.nta.nic.in ను సందర్శించాలి.
- హోమ్పేజీలో కనిపించే 'Final Opportunity to Confirm/Update Bank Account Details for NEET (UG) 2026 Fee Refund' అనే లింక్పై క్లిక్ చేయాలి.
- తమ లాగిన్ వివరాలతో సైన్ ఇన్ అయిన తర్వాత, డాష్బోర్డ్లో కనిపించే బ్యాంక్ వివరాలను జాగ్రత్తగా సరిచూసుకోవాలి.
- ఏవైనా మార్పులు అవసరమైతే వాటిని సరిదిద్ది, సబ్మిట్ చేయాలి.
ఒక్కసారి వివరాలు సమర్పించిన తర్వాత వాటినే తుదిగా పరిగణిస్తామని, గడువు ముగిశాక మార్పుల కోసం ఎలాంటి అభ్యర్థనలను అంగీకరించబోమని ఎన్టీఏ స్పష్టం చేసింది. అందువల్ల విద్యార్థులు తమ బ్యాంక్ అకౌంట్ నంబర్, ఐఎఫ్ఎస్సీ కోడ్, ఖాతాదారుడి పేరు వంటి వివరాలను చాలా జాగ్రత్తగా, పొరపాట్లకు తావులేకుండా నమోదు చేయాలని సూచించింది. ప్రక్రియ పూర్తయ్యాక, కన్ఫర్మేషన్ పేజీని డౌన్లోడ్ చేసుకుని భవిష్యత్ అవసరాల కోసం భద్రపరచుకోవడం మంచిదని తెలిపింది.