కాల్ మనీ మాఫియా వెనుక కేశినేని చిన్ని ఉన్నారు: చంద్రబాబుకు కేశినేని నాని బహిరంగ లేఖ

Kesineni Nani open letter to Chandrababu alleging Kesineni Chinni behind call money mafia
  • చాగర్ల గాయత్రి అనే మహిళ ఐదు కోట్ల అప్పు చేసి వడ్డీతో 21 కోట్లు కట్టారన్న నాని
  • అయినా ఆమెను నాని, మూల్పూరి కిశోర్ వేధిస్తున్నారని ఆరోపణ
  • నిందితులను పోలీసులు అరెస్ట్ చేయడం లేదని మండిపాటు

విజయవాడలో ‘కాల్ మనీ’ మాఫియా మళ్లీ పడగ విప్పిందని, దీని వెనుక స్వయంగా స్థానిక టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని హస్తం ఉందంటూ మాజీ ఎంపీ, వైసీపీ నేత కేశినేని నాని సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆయన ఒక బహిరంగ లేఖ రాశారు. ఎంపీతో పాటు ఆయన ముఖ్య అనుచరుడు మూల్పూరి కిశోర్ ఈ మాఫియా సామ్రాజ్యాన్ని నడిపిస్తున్నారని లేఖలో ఆరోపించారు.


విజయవాడకు చెందిన మహిళా వ్యాపారవేత్త చాగర్ల గాయత్రి ఐదు కోట్ల రూపాయల అప్పు తీసుకుని, అసలుతో పాటు వడ్డీ కూడా కలుపుకుని మొత్తం రూ.21 కోట్లు పూర్తిగా కట్టేశారని... అయినా సరే ఎంపీ చిన్ని, ఆయన అనుచరుడు కిశోర్ ఆమెను వదలకుండా వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. బాధితురాలికి బాపులపాడు మండలంలో ఉన్న 11 ఎకరాల ఖరీదైన భూమిని ఫోర్జరీ పత్రాల ద్వారా లాక్కోవడానికి, ఆ భూమిని కబ్జా చేసేందుకు రెవెన్యూ అధికారులపై ఎంపీ కార్యాలయం తీవ్ర ఒత్తిడి తెస్తోందని విమర్శించారు.


బాధితురాలి నివాసంలోకి చొరబడి దౌర్జన్యం చేసిన ఘటనపై మాచవరం పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైనప్పటికీ, అధికార బలం కలిగిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేయడం లేదన్నారు. నగర టాస్క్‌ఫోర్స్ పోలీసులను ప్రైవేట్ గూండా సైన్యంగా వాడుకుంటూ అర్ధరాత్రి వేళల్లో పౌరులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవస్థీకృత నేరాలకు పాల్పడుతున్న మూల్పూరి కిషోర్‌పై తక్షణమే పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపాలని డిమాండ్ చేశారు.

గతంలో 2015లో విజయవాడను కుదిపేసిన కాల్ మనీ ఉదంతం తరహాలోనే ప్రస్తుత పరిస్థితులు ఉన్నాయని, ముఖ్యమంత్రి తక్షణమే స్పందించి ఈ అధికార అహంకార మాఫియాను ఉక్కుపాదంతో అణచివేయాలని కోరారు. బాధితురాలి కుటుంబానికి, ఆస్తులకు నిరంతర పోలీస్ రక్షణ కల్పించాలని... నగర ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు భరోసా దక్కే వరకు సామాన్యుల పక్షాన తన పోరాటం ఆగేది లేదని కేశినేని నాని స్పష్టం చేశారు.

Kesineni Nani
Kesineni Chinni
Chandrababu Naidu
Call Money Mafia Vijayawada
Mulpuri Kishore
Andhra Pradesh Politics

More Telugu News