ఆస్ట్రేలియాలో ప్లంబర్కు ఏడాదికి రూ.67 లక్షలు.. వైరల్ అవుతున్న భారతీయుడి పోస్ట్
- ఆస్ట్రేలియాలో చేతి వృత్తులకు అధిక గౌరవమని తెలిపిన అడ్డీ ఖనేజా
- ప్లంబర్లు, కార్పెంటర్లకు భారీ ఆదాయం
- 15 నిమిషాల పనికి 150 డాలర్ల వరకు చెల్లిస్తున్న వెల్లడి
- నైపుణ్యానికే విలువ ఇస్తున్న అక్కడి సమాజం
- చేతి వృత్తులపై భారత్ దృక్పథం మారాలని సూచన
ఆస్ట్రేలియాకు వెళ్లిన తర్వాత తనను ఆశ్చర్యపరిచింది అక్కడి జీతాలు మాత్రమే కాదని, చేతి వృత్తులకు లభించే గౌరవమని ఖనేజా చెప్పారు. అక్కడ చాలా మంది చిన్నారులు ప్లంబర్, ఎలక్ట్రీషియన్, కార్పెంటర్ కావాలని కలలు కంటారని తెలిపారు. ఈ వృత్తులకు మంచి ఆదాయం, స్థిరమైన ఉద్యోగ భద్రత, సమాజంలో గౌరవం లభిస్తాయని చెప్పారు.
ఆయన వివరాల ప్రకారం నిర్మాణ రంగ మేనేజర్లు ఏడాదికి దాదాపు 2 లక్షల ఆస్ట్రేలియన్ డాలర్లు (సుమారు రూ.1.1 కోటి) సంపాదించే అవకాశం ఉంది. అనుభవం ఉన్న ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు ఏడాదికి 1.2 లక్షల ఆస్ట్రేలియన్ డాలర్లకు (సుమారు రూ.67 లక్షలు) పైగా ఆదాయం పొందుతున్నారు.
తన ఇంట్లో ఒకసారి తలుపు లాక్ను సరిచేయడానికి కార్పెంటర్ వచ్చాడని ఖనేజా చెప్పారు. కేవలం 15 నిమిషాల్లో పని పూర్తి చేశాడని తెలిపారు. అందుకు 150 ఆస్ట్రేలియన్ డాలర్లు వసూలు చేశాడన్నారు. అది ఎక్కువ అనిపించలేదని, అతడి నైపుణ్యానికి చెల్లించిన పారితోషికంగా భావించానని చెప్పారు.
భారత్లో తనకు తెలిసిన భూపిందర్ అనే కార్పెంటర్ ఎంతో నైపుణ్యం ఉన్నప్పటికీ తక్కువ ఆదాయంతో జీవించేవాడని గుర్తుచేశారు. ఈ రెండు దేశాల మధ్య ఉన్న తేడా డబ్బులో కాదని, పనికి ఇచ్చే గౌరవంలో ఉందని వ్యాఖ్యానించారు.
తనకు పిల్లలు ఉంటే ముందుగా కార్పెంట్రీ నేర్చుకోమని చెప్పేవాణ్నని సరదాగా వ్యాఖ్యానించారు. అయితే దాని వెనుక ఉన్న సందేశం చాలా గొప్పదని చెప్పారు. వృత్తి విద్య కూడా డిగ్రీతో సమానంగా విలువైనదేనని, జీవితాంతం ఉపాధి కల్పించే శక్తి దానికి ఉందని అభిప్రాయపడ్డారు.
సైకాలజీ కూడా ఇదే విషయాన్ని చెబుతోందని ఆయన పేర్కొన్నారు. ఒక వృత్తికి సమాజంలో గౌరవం లభిస్తే ఉద్యోగ సంతృప్తి, ఆత్మవిశ్వాసం, పనితీరు పెరుగుతాయని వివరించారు. భారత్లో కూడా చేతి వృత్తులపై ఉన్న పాత అభిప్రాయాలు మారాల్సిన అవసరం ఉందని సూచించారు.