కన్నీళ్లు పెట్టిస్తున్న వెనిజువెలా భూకంప బాధితుల గాథలు.. భారత్కు కృతజ్ఞతలు చెబుతూ ఎమోషనల్ వీడియోలు!
- వెనిజువెలాలో భారత ఆర్మీ ఫీల్డ్ హాస్పిటల్
- ‘ఆపరేషన్ అమిస్తాద్’ ప్రారంభం
- వరుస భూకంపాల్లో 2,954 మంది మృతి
- 66 టన్నుల మానవతా సాయం అందజేత
- వెనిజువెలా విదేశాంగ మంత్రి ప్రశంసలు
జూన్ 24న వెనిజువెలాలో సంభవించిన 7.2, 7.5 తీవ్రత కలిగిన వరుస భూకంపాల తర్వాత.. భారతదేశం అక్కడ ‘ఆపరేషన్ అమిస్తాద్’ (ఆపరేషన్ స్నేహం) పేరుతో మానవతా సహాయక మిషన్ను ప్రారంభించింది. ఇందులో భాగంగా రాజధాని కారకాస్లోని 'ఇంటర్నేషనల్ లా రింకోనాడా రేస్ట్రాక్' వద్ద ఇండియన్ ఆర్మీ తాత్కాలిక ఫీల్డ్ హాస్పిటల్ను ఏర్పాటు చేసి అత్యవసర వైద్య సేవలు, శస్త్రచికిత్సలు నిర్వహిస్తోంది.
ఈ ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకుంటున్న బాధితుల ఎమోషనల్ వీడియోలను భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ సామాజిక మాధ్యమం ఎక్స్లో షేర్ చేశారు. లా గుఐరా భూకంపంలో తీవ్రంగా గాయపడి, రెండు చేతులు, ఒక కాలు విరిగిన యో గార్సియా అనే యువకుడు ఆసుపత్రి బెడ్పై నుంచి మాట్లాడుతూ.. "భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఇక్కడ నాకు సర్జరీ విజయవంతంగా జరిగింది. నేను ఇప్పుడు కోలుకుంటున్నాను" అని తెలిపాడు. మరో వీడియోలో లిజ్జెట్ రోడ్రిగ్జ్ అనే తల్లి, తొడ ఎముక విరిగిన తన కుమారుడు ఆంథోనీ అగ్యులార్టెకు అద్భుతమైన చికిత్స అందించి కాపాడినందుకు భారత వైద్య బృందానికి కృతజ్ఞతలు తెలిపింది.
భారత రాయబార కార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం.. ఈ మిషన్లో మొబైల్ ఆసుపత్రి యూనిట్లు, నిపుణులైన వైద్యులు, మందులు, వైద్య పరికరాలు ఉన్నాయి. భారత వైమానిక దళానికి చెందిన రెండు సి-17 గ్లోబ్మాస్టర్ విమానాల ద్వారా 66 టన్నుల సహాయక సామగ్రిని వెనిజువెలాకు చేరవేశారు. ఇందులో ఫీల్డ్ హాస్పిటల్తో పాటు 35 టన్నుల మందులు, విపత్తు ప్రాంతాల్లో అత్యాధునిక అత్యవసర వైద్య సంరక్షణ అందించే రెండు 'భీష్మ్' క్యూబ్స్ మొబైల్ హాస్పిటల్ యూనిట్లు ఉన్నాయి.
వెనిజువెలా విదేశాంగ మంత్రి వైవన్ గిల్, భారత రాయబారి పి.కె.అశోక్ బాబుతో కలిసి ఈ ఫీల్డ్ హాస్పిటల్ను సందర్శించి వైద్యులను, రోగులను పరామర్శించారు. కష్టకాలంలో ఆదుకున్నందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, భారత ప్రజలకు వెనిజువెలా ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
వెనిజువెలాలో సంభవించిన భయంకరమైన ఈ విపత్తులో ఇప్పటివరకు 2,954 మంది ప్రాణాలు కోల్పోగా, 16,592 మంది గాయపడ్డారు. ఐక్యరాజ్యసమితి నివేదికల ప్రకారం.. శిథిలాల కింద చిక్కుకుని దాదాపు 50,000 మంది వరకు అదృశ్యమైనట్లు అంచనా వేస్తున్నారు.