సీఎం మూడు రోజుల కుప్పం టూర్ సక్సెస్.. భారీగా పెట్టుబడులు, కీలక సమస్యకు పరిష్కారం
- 61 ఏళ్లుగా పెండింగులో ఉన్న కంగుంది రైతుల భూ సమస్యకు పరిష్కారం
- రూ.9322 కోట్ల పెట్టుబడులతో 30 పరిశ్రమల ఏర్పాటుకు ఒప్పందాలు
- కుప్పం నుంచి నేరుగా అమరావతి సచివాలయానికి బయలుదేరిన సీఎం
- నేడు ఆర్టీజీ, ఆర్థిక రీజియన్లపై ఉన్నత స్థాయి సమీక్షల్లో పాల్గొననున్న చంద్రబాబు
మూడు రోజుల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి అత్యంత బిజీగా గడిపారు. రైతులు, వివిధ పథకాల లబ్ధిదారులు, ప్రభుత్వ అధికారులు, పార్టీ శ్రేణులు మరియు పారిశ్రామికవేత్తలతో ఆయన వరుస సమావేశాలు నిర్వహించారు. ప్రధానంగా కంగుంది గ్రామానికి చెందిన రైతుల 61 ఏళ్ల నాటి భూ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడం ఈ పర్యటనలో విశేషం. దీనితో పాటు, రూ. 9,322 కోట్ల పెట్టుబడితో కుప్పం ప్రాంతానికి 30 పరిశ్రమలను తీసుకువచ్చేలా పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు మరియు అవగాహన ఒప్పందాలు (MoUలు) జరిగాయి.
ఈ నెల 1వ తేదీన నెల్లూరు జిల్లా గూడూరులో పింఛన్ల పంపిణీతో ప్రారంభమైన ముఖ్యమంత్రి జిల్లాల పర్యటన, మొత్తం నాలుగు జిల్లాల్లో ఆరు రోజుల పాటు కొనసాగి నేటితో ముగిసింది. అమరావతి చేరుకున్న వెంటనే ముఖ్యమంత్రి అధికారిక కార్యక్రమాల్లో నిమగ్నం కానున్నారు. నేడు ఉదయం రియల్ టైమ్ గవర్నెన్స్ (RTG)పై, మధ్యాహ్నం విశాఖపట్నం, అమరావతి, తిరుపతి ఆర్థిక మండళ్లపై (ఎకనామిక్ రీజియన్స్) జరగనున్న సమీక్షా సమావేశాలకు ఆయన హాజరుకానున్నారు.