పాకిస్థాన్కు వ్యతిరేకంగా పీవోకేలో ప్రజా ఉద్యమం.. రోడ్లపైకి వేలాది మంది.. కాల్పుల్లో ఒకరి మృతి!
- పాక్ ఆక్రమిత కశ్మీర్ వ్యాప్తంగా ప్రజా తిరుగుబాటు
- నిరసనకారులపై పోలీసుల కాల్పులు
- 600 మందికి పైగా నిరసనకారుల అరెస్ట్
- ఇంటర్నెట్, కమ్యూనికేషన్ సర్వీసులు బంద్
- కృత్రిమ ఆర్థిక దిగ్బంధంపై ఆగ్రహం
యాక్షన్ కమిటీ పిలుపు మేరకు ముజఫరాబాద్, రావలకోట్, మీర్పూర్, దాద్యాల్, దేరకోట్, జీరో పాయింట్, తియాత్రీ నోట్, సరోసా ప్రాంతాల్లో భారీగా ప్రజలు గుమిగూడారు. అన్బ్ ప్రాంతంలో ప్రదర్శనకారులపై పోలీసులు, రేంజర్స్ బలగాలు టియర్ గ్యాస్ షెల్లింగ్ జరపడంతో పాటు కాల్పులకు తెగబడ్డాయి. ఈ కాల్పుల్లో మహ్మద్ యాకూబ్ అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు.
కాల్పులు, టియర్ గ్యాస్ కారణంగా మరో నలుగురు యువకులు కూడా గాయపడినట్లు స్థానిక వర్గాలు తెలిపాయి. యాక్షన్ కమిటీ నాయకుడు షౌకత్ నవాజ్ మీర్ సహా అరెస్టయిన వారందరినీ విడుదల చేయాలని, మృతదేహాలను కుటుంబాలకు అప్పగించాలని నిరసనకారులు డిమాండ్ చేశారు.
ఉగ్రవాద నిరోధక చట్టం కింద 'జాక్' సంస్థపై పాక్ ప్రభుత్వం నిషేధం విధించిన తర్వాత భద్రతా దళాలు పీవోకే వ్యాప్తంగా ఉక్కుపాదం మోపాయి. సీనియర్ నాయకుడు షౌకత్ నవాజ్ మీర్తో పాటు 600 మందికి పైగా కార్యకర్తలు, రాజకీయ నాయకులను అరెస్ట్ చేశారు. పీఓకేలోని ప్రధాన పట్టణాలకు ఆహారం, పిండి, అత్యవసర మందుల సరఫరా నిలిచిపోయేలా పాక్ అధికారులు కృత్రిమ ఆర్థిక దిగ్బంధాన్ని విధించారని స్థానిక నిరసనకారులు, సామాజిక కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. సమాచారం బయటకు పొక్కకుండా ఉండేందుకు, మరిన్ని ర్యాలీలు నిర్వహించకుండా నిరోధించేందుకు అధికారులు పలు జిల్లాల్లో ఇంటర్నెట్, కమ్యూనికేషన్ బ్లాకౌట్ను అమలు చేస్తున్నారు.