20 ఏళ్ల కిందట తన చేతిలో ఓడిన ప్రత్యర్థికి కీలక పదవి.. సీఎం రేవంత్ రెడ్డి హామీ
- 20 ఏళ్ల నాటి ప్రత్యర్థి గౌస్ రబ్బానీకి ప్రభుత్వంలో పదవిపై హామీ
- తొలి రాజకీయ విజయానికి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మిడ్జిల్లో పర్యటన
- రబ్బానీకి తగిన బాధ్యతలు అప్పగించాలని డిప్యూటీ సీఎం భట్టికి సూచన
2006 జులై 4న జరిగిన జడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన రబ్బానీపై రేవంత్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించారు. ఈ చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. రబ్బానీకి తగిన పదవిని గుర్తించి, బాధ్యతలు అప్పగించాలని అక్కడికక్కడే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను ఆదేశించారు. దీనితో పాటు తన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైన మిడ్జిల్ మండల సమగ్ర అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
నాటి సంఘటనలను గుర్తుచేసుకున్న రేవంత్ రెడ్డి, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రబ్బానీని జడ్పీ ఛైర్మన్గా నియమించాలని భావించిందని పేర్కొన్నారు. గత 35 ఏళ్లుగా సింగిల్ విండో ఛైర్మన్గా, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పార్టీకి రబ్బానీ చేసిన సేవలు వృథా కావని ఆయన స్పష్టం చేశారు.
ఈ పర్యటనలో భాగంగా ఉర్కొండపేటలోని పబ్బతి ఆంజనేయ స్వామి ఆలయంలో రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మిడ్జిల్లో కల్వకుర్తి, నాగర్ కర్నూలు ప్రాంతాల్లో గుర్తింపు పొందిన నాయకుడు ద్యాప గోపాల్ రెడ్డి విగ్రహంతో పాటు, డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు.