విజయ్ పార్టీలోకి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల క్యూ.. నేడు మహాబలిపురంలో చేరికలు
- టీవీకే పార్టీలోకి అన్నాడీఎంకే నేతల వలస
- పార్టీ తీర్థం పుచ్చుకోనున్న ఐదుగురు మాజీ మంత్రులు, 15 మంది మాజీ ఎమ్మెల్యేలు
- మహబలిపురం రిసార్ట్లో భారీ చేరికల కార్యక్రమం
- మహా అల్గిరి కుమార్తె కయల్విళి సైతం విజయ్ గూటికే
ఈ భారీ చేరికల జాబితాలో అన్నాడీఎంకేకు చెందిన ఐదుగురు మాజీ మంత్రులు ఉన్నారు. అందులో ముఖ్యంగా సి. విజయభాస్కర్, ఎంఆర్ విజయభాస్కర్, ఎంఎస్ఎమ్ ఆనందన్, ఎస్.వలర్మతి వంటి పవర్ ఫుల్ నేతలతో పాటు దాదాపు 15 మంది మాజీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. వీరితో పాటు కరూర్, పుదుక్కోట్టై జిల్లాలకు చెందిన వందలాది మంది జిల్లా స్థాయి పదవుల్లో ఉన్న ముఖ్య నేతలు, స్థానిక ప్రజాప్రతినిధులు కూడా విజయ్ సమక్షంలో కండువా కప్పుకోనున్నారు. ఈ వలసల పర్వంలో మాజీ కేంద్ర మంత్రి ఎంకే అల్గిరి కుమార్తె కయల్విళి కూడా టీవీకే పార్టీలో చేరనుండటం గమనార్హం.
బలపడుతున్న విజయ్.. బలహీనపడుతున్న ఈపీఎస్
ఇటీవల జరిగిన 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీ రాకపోయినప్పటికీ, పొత్తుల మద్దతుతో విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఎన్నికల ఓటమి తర్వాత ఎడప్పాడి కె.పళనిస్వామి (ఈపీఎస్) నాయకత్వంలోని ఏఐఏడీఎంకే తీవ్ర అంతర్గత సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఎన్నికల్లో వరుస పరాజయాలతో డీలా పడిన కార్యకర్తలు.. ఇప్పుడు భవిష్యత్తు అంతా సీఎం విజయ్ వైపే ఉందని భావించి పెద్ద ఎత్తున పార్టీ మారుతున్నారు. ఇప్పటికే గతంలో పలువురు ఏఐఏడీఎంకే కీలక నేతలను చేర్చుకున్న టీవీకే.. ఇప్పుడు ఈ భారీ ఆపరేషన్ ఆకర్ష్తో తమిళనాడులో తన సంస్థాగత బలాన్ని మరింత పెంచుకుంటోంది.