అమెరికా వరదల్లో తెలుగు టెకీ దుర్మరణం

Telugu Techie dies in US floods tragedy in Bapatla district
  • అమెరికాలో వరదలకు ఏపీకి చెందిన యువకుడు బలి
  • కాన్సస్ వరదల్లో కొట్టుకుపోయిన టెకీ వెంకటేశ్
  • బాపట్ల జిల్లా దేవరపల్లి వాసిగా గుర్తింపు
  • కారుతో సహా వరద నీటిలో కొట్టుకుపోవడంతో దుర్ఘటన
అమెరికాలో ఉన్నత భవిష్యత్తు కోసం వెళ్లిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ యువకుడు ఆకస్మిక వరదలకు బలయ్యాడు. కాన్సస్ రాష్ట్రంలో సంభవించిన వరదల్లో గల్లంతైన దొప్పలపూడి వెంకటేశ్ (32) మరణించినట్లు అధికారులు ధ్రువీకరించారు. కారుతో సహా వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన ఆయన, రెండు రోజుల గాలింపు అనంతరం విగతజీవిగా లభ్యమయ్యారు.

వివరాల్లోకి వెళితే.. బాపట్ల జిల్లా పర్చూరు మండలం దేవరపల్లి గ్రామానికి చెందిన వెంకటేశ్, సుమారు మూడేళ్ల క్రితం ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. అక్కడ మాస్టర్స్ పూర్తి చేసి నెబ్రాస్కా రాష్ట్రంలోని ఒమాహా నగరంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. శనివారం నాడు కాన్సస్‌లోని వెల్లింగ్టన్ సమీపంలో కారులో ప్రయాణిస్తుండగా, ఎస్. ఆలివర్ రోడ్ వద్ద ఆయన వాహనం ఒక్కసారిగా వచ్చిన వరద ప్రవాహంలో చిక్కుకుని కొట్టుకుపోయింది. ఒక ప్రత్యక్ష సాక్షి కారు నీటిలోకి వెళ్లడం గమనించి అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే సహాయక బృందాలు రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టాయి. అయితే, వరద ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో గాలింపునకు తీవ్ర ఆటంకం కలిగింది.

రాత్రి సమయంలో గాలింపును నిలిపివేసి, ఆదివారం ఉదయం తిరిగి ప్రారంభించారు. ఈ క్రమంలో ఘటన జరిగిన ప్రదేశానికి సుమారు 1.3 మైళ్ల దూరంలో వెంకటేష్ మృతదేహాన్ని అధికారులు కనుగొన్నారు.ఈ విషయం తెలియగానే వెంకటేష్ తండ్రి దొప్పలపూడి రాంబాబు, ఇతర కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. కుమారుడి ఆచూకీ కోసం స్థానిక ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావును ఆశ్రయించి, సహాయం చేయాలని కోరారు. తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే.. కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌తో పాటు నారా లోకేష్‌కు లేఖలు రాశారు. అమెరికా రాయబార కార్యాలయంతో మాట్లాడి, సహాయక చర్యలు వేగవంతం చేసి, మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు.             
Doppalapudi Venkatesh
Telugu Techie US Flood Death
Kansas Flash Floods
Bapatla District Andhra Pradesh
Software Engineer Missing In USA
US Flood Victims

More Telugu News