వాణిజ్య వినియోగదారులకు ఊరట.. పెట్రోల్, డీజిల్ పై ఆంక్షలు ఎత్తివేత
- పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై తాత్కాలిక ఆంక్షలను ఎత్తివేసిన కేంద్రం
- జులై 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానున్నట్లు ప్రకటన
- ఇంధన సరఫరాలు స్థిరపడటంతో ప్రభుత్వ నిర్ణయం
- వాణిజ్య, పారిశ్రామిక సంస్థలకు పెద్ద ఊరట
- పీఎన్జీ వాడకాన్ని ప్రోత్సహించడమే లక్ష్యమని స్పష్టీకరణ
ఇరాన్పై యుద్ధం కారణంగా హర్మూజ్ జలసంధి మీదుగా ఇంధన సరఫరాలకు అంతరాయం కలగవచ్చన్న ఆందోళనలతో, ఈ ఏడాది జూన్ 12న కేంద్రం ముందుజాగ్రత్త చర్యగా ఈ ఆంక్షలను విధించింది. దీనికి తోడు, బల్క్, రిటైల్ డీజిల్ ధరల మధ్య లీటర్కు సుమారు రూ.40 వ్యత్యాసం ఉండటంతో అనేక వాణిజ్య సంస్థలు రిటైల్ బంకుల వైపు మళ్లాయి. ఈ నేపథ్యంలో ఇంధన సరఫరాను కాపాడేందుకు వాణిజ్య సంస్థలు బంకుల నుంచి నేరుగా ఇంధనం కొనడాన్ని నిషేధించడంతో పాటు, డీజిల్ కొనుగోళ్లపై రోజుకు 200 లీటర్ల పరిమితి విధించారు.
ప్రస్తుతం ఇంధన సరఫరాలు క్రమంగా స్థిరపడుతుండటంతో ప్రభుత్వం ఆంక్షలను దశలవారీగా సడలిస్తోంది. ఇటీవలే హోటళ్లు, రెస్టారెంట్లకు వాణిజ్య ఎల్పీజీ సరఫరాను కూడా సాధారణ స్థితికి పునరుద్ధరించింది. అయితే, ఇప్పటికే పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్జీ)కి మారిన వినియోగదారులను తిరిగి ఎల్పీజీ వాడకానికి అనుమతించబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. పీఎన్జీ వినియోగాన్ని ప్రోత్సహించడమే తమ లక్ష్యమని తేల్చిచెప్పింది.