ఐటీఆర్‌ నుంచి ఆధార్‌, క్రెడిట్‌ కార్డుల వరకు.. జులై 1 నుంచి కొత్త రూల్స్‌

  • ఐటీఆర్‌ దాఖలుకు జులై 31 గడువు
  • ఆధార్‌లో ఈ-మెయిల్‌ అప్‌డేట్‌ ఆరు నెలలు ఉచితం
  • ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డు రివార్డు పాయింట్లలో మార్పులు
  • హెచ్‌డీఎఫ్‌సీ లాంజ్‌ సదుపాయానికి షరతు
  • జులై 1 నుంచి పాస్‌పోర్ట్‌ ఫీజుల పెంపు
కొత్త నెల ప్రారంభం కానుందంటే ఆర్థికంగా కొన్ని కీలక మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. డబ్బు, బ్యాంకింగ్‌, పన్నులు, క్రెడిట్‌ కార్డులకు సంబంధించి ఏదో అప్‌డేట్‌ ఉంటూ ఉంటుంది. ఈ క్రమంలో జులై 1 నుంచి ఆధార్‌ నుంచి పాస్‌పోర్ట్‌, ఐటీఆర్‌ నుంచి క్రెడిట్‌ కార్డుల వరకు పలు కొత్త మార్పులు అమల్లోకి రానున్నాయి.

ఐటీఆర్‌ గడువు
2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్నులు జులై 31లోపు దాఖలు చేయాలి. ఐటీఆర్‌-1, ఐటీఆర్‌-2 దాఖలు చేసే వారికి ఈ గడువు వర్తిస్తుంది. ఆలస్యమైతే జరిమానా పడే అవకాశం ఉంది. కొన్ని పన్ను ప్రయోజనాలు కూడా కోల్పోవచ్చు. కాబట్టి చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే రిటర్నులు దాఖలు చేయడం మంచిది.

ఆధార్‌లో ఈ-మెయిల్‌ అప్‌డేట్‌
ఆధార్‌ వినియోగదారులకు ఇది శుభవార్త. ఆధార్‌లో నమోదైన ఈ-మెయిల్‌ చిరునామాను మార్చుకోవడానికి ఇకపై రూ.75 చెల్లించాల్సిన అవసరం లేదు. ఆధార్‌ మొబైల్‌ యాప్‌ ద్వారా ఈ సేవను ఉచితంగా పొందవచ్చు. ఈ సదుపాయం 2026 డిసెంబర్‌ 31 వరకు అందుబాటులో ఉంటుంది.

ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డుల్లో కొత్త రూల్స్‌
ఫోన్‌పే ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డుల రివార్డు పాయింట్ల విధానంలో మార్పులు వస్తున్నాయి. కొన్ని లావాదేవీలపై ఇకపై రివార్డు పాయింట్లు ఇవ్వరు. అలాగే ఖర్చులు నిర్దేశిత పరిమితి దాటితేనే పాయింట్లు లభిస్తాయి. ఈ మార్పులు ఎంపిక చేసిన కార్డులకు మాత్రమే వర్తిస్తాయి.

హెచ్‌డీఎఫ్‌సీ కొత్త షరతు
హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌ కార్డు వినియోగదారులకు ఎయిర్‌పోర్ట్‌ లాంజ్‌ సదుపాయంపై కొత్త నిబంధన అమల్లోకి వస్తుంది. ఒక త్రైమాసికంలో మూడు ఉచిత లాంజ్‌ సందర్శనలు పొందాలంటే.. అంతకుముందు త్రైమాసికంలో కనీసం రూ.60 వేలు ఖర్చు చేసి ఉండాలి. 

పాస్‌పోర్ట్‌ సేవలు ఖరీదు
జులై 1 నుంచి పాస్‌పోర్ట్‌ ఫీజులు పెరగనున్నాయి. సాధారణ, తత్కాల్‌ పాస్‌పోర్ట్‌లకు కొత్త రుసుములు అమల్లోకి వస్తాయి. దేశీయంగా, విదేశాల్లో దరఖాస్తు చేసుకునే వారందరికీ ఈ మార్పులు వర్తిస్తాయి. 

బ్యాంకుల మిస్‌సెల్లింగ్‌కు చెక్‌
బ్యాంకులు అవసరం లేని బీమా, పెట్టుబడి ఉత్పత్తులను బలవంతంగా విక్రయించకుండా ఆర్‌బీఐ కొత్త నిబంధనలు తీసుకొస్తోంది. జులై 1 నుంచే ఈ మార్గదర్శకాలు అమల్లోకి రానున్నాయి. కస్టమర్ల ప్రయోజనాలను కాపాడడమే దీని ఉద్దేశం.

More Telugu News