అన్నదాతలకు అండగా ఉంటాం: ఏరువాక వేళ పవన్ కల్యాణ్ భరోసా

Pawan Kalyan Assures Support to Farmers on Eruvaka Punnami
  • రైతు సోదరులకు ఏరువాక పున్నమి శుభాకాంక్షలు తెలిపిన పవన్ కల్యాణ్
  • అన్నదాతలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా
  • పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధులు ఇప్పటికే జమ చేశామని వెల్లడి
  • సకాలంలో వర్షాలు కురిసి, పంటలు బాగా పండాలని ఆకాంక్ష
  • వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని స్పష్టీకరణ
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రాష్ట్రంలోని రైతు సోదరులకు ఏరువాక పున్నమి శుభాకాంక్షలు తెలియజేశారు. జ్యేష్ఠ పౌర్ణమి పర్వదినాన జరుపుకునే ఈ పండుగ.. భూమాతకు, పశుసంపదకు గౌరవం ఇస్తూ, ప్రకృతికి - మనిషికి మధ్య ఉన్న విడదీయలేని అనుబంధాన్ని చాటుతుందని ఆయన పేర్కొన్నారు.

ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని రైతులు భూమికి పూజలు నిర్వహించి, నూతనోత్సాహంతో సాగు పనులకు శ్రీకారం చుడతారని పవన్ కల్యాణ్ తన సందేశంలో తెలిపారు. సకాలంలో తగినంత వర్షాలు కురిసి, పంటలు సమృద్ధిగా పండాలని, తద్వారా అన్నదాతలంతా సుఖసంతోషాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల వేదికగా ఆయన తన సందేశాన్ని పంచుకున్నారు.

రైతు సంక్షేమానికి, వ్యవసాయాభివృద్ధికి తమ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని పవన్ కల్యాణ్ పునరుద్ఘాటించారు. ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనంగా ఇప్పటికే 'పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ' పథకం మొదటి విడత నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. త్వరలో ప్రారంభం కానున్న 'వీబీ-జీ ర్యామ్ జీ' ప్రాజెక్టుల ద్వారా కూడా రైతులకు మేలు చేకూరేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వివరించారు. వ్యవసాయ రంగాన్ని పటిష్టం చేసేందుకు తమ ప్రభుత్వం ప్రత్యేక విధానాలతో పనిచేస్తోందని పవన్ స్పష్టం చేశారు.                                
Pawan Kalyan
Eruvaka Punnami
Andhra Pradesh Deputy CM
Annadata Sukhibhava
Farmer Welfare
Agriculture Development

More Telugu News