మహానాడు ఎలా జరుపుదాం?... పార్టీ అగ్రనేతలతో చంద్రబాబు సమావేశం

Chandrababu Naidu Discusses Mahanadu Plans With TDP Leaders
  • మహానాడు ఏర్పాట్లపై టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం
  • "కార్యకర్తే అధినేత" అనేలా కార్యక్రమం ఉండాలని చంద్రబాబు సూచన
  • మహిళలు, బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలని పార్టీ నేతలకు ఆదేశం
  • హైబ్రిడ్ విధానంలో జరిగే మహానాడుకు 19 తీర్మానాలకు ఆమోదం
  • మే 27, 28 తేదీల్లో మహానాడు నిర్వహించాలని నిర్ణయం
టీడీపీ మహానాడు ఏర్పాట్లపై పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన గురువారం పొలిట్‌బ్యూరో సమావేశం జరిగింది. మే 27, 28 తేదీల్లో హైబ్రిడ్ పద్ధతిలో నిర్వహించనున్న ఈ కార్యక్రమ అజెండాపై నేతలకు చంద్రబాబు కీలక దిశానిర్దేశం చేశారు. 

హైబ్రిడ్ విధానంలో నిర్వహించే మహానాడును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం కోసం రూపొందించిన 19 తీర్మానాలకు పొలిట్‌బ్యూరో ఆమోదం తెలిపింది. ఉండవల్లిలోని తన నివాసం నుంచి చంద్రబాబు వర్చువల్‌గా పాల్గొనగా, ఇతర నేతలు మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్ నుంచి ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఉదయం 9 గంటల నుంచే కార్యక్రమాలు ప్రారంభించాలని, ప్రతి వక్త తమకు కేటాయించిన అంశంపైనే సూటిగా, స్పష్టంగా మాట్లాడాలని చంద్రబాబు ఆదేశించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. పార్టీకి మహిళలు, బీసీలు రెండు కళ్ల లాంటివారని పునరుద్ఘాటించారు. "మహిళలకు టీడీపీ ఇస్తున్న ప్రాధాన్యాన్ని అందరికీ అర్థమయ్యేలా చాటాలి. జనాభాలో 50 శాతం ఉన్న బీసీలు పార్టీ ఆవిర్భావం నుంచీ మనకు వెన్నుదన్నుగా ఉన్నారు. వారి అభివృద్ధికి పార్టీ కట్టుబడి ఉందనే సందేశం స్పష్టంగా వెళ్లాలి" అని నేతలకు సూచించారు. "కార్యకర్తే అధినేత" అనే నినాదం మహానాడులో స్పష్టంగా ప్రతిబింబించాలని, పార్టీ సంప్రదాయ ఓటు బ్యాంకును జాగ్రత్తగా కాపాడుకోవాలని స్పష్టం చేశారు.

కాగా, ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పొదుపు మంత్రం నేపథ్యంలో, ఈసారి మహానాడును మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్ నుంచి హైబ్రిడ్ విధానంలో నిర్వహించాలని నిర్ణయించారు. పార్టీ అగ్రనేతలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదిక పైనుంచి ప్రసంగిస్తారు. పార్టీ క్యాడర్ కోసం రాష్ట్రవ్యాప్తంగా వందల సంఖ్యలో డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు. 
Go Back to Shorts
Chandrababu Naidu
TDP Mahanadu
Telugu Desam Party
Andhra Pradesh Politics
Political Meeting
Hybrid Event
BC Welfare
Women Empowerment
Party Resolutions

More Telugu News