'డేవిడ్ రెడ్డి' చిత్ర బృందంలో ఒకరి మృతి... పోలీసులకు మంచు మనోజ్ కీలక విజ్ఞప్తి

Manchu Manoj Requests Police Investigation into David Reddy Crew Member Death
  • టెక్నిషియన్‌గా పని చేస్తున్న లక్ష్మణ్ రావు మృతి
  • మరణవార్త తెలియగానే ఎమోషనల్ అయిన మంచు మనోజ్
  • లక్ష్మణ్ రావు మృతి వెనుక అసలు కారణం బయటకు రావాలన్న మనోజ్
  • తెలంగాణ, కర్ణాటక రాష్ట్ర డీజీపీలను ట్యాగ్ చేస్తూ ట్వీట్
టాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. మంచు మనోజ్ హీరోగా నటిస్తున్న 'డేవిడ్ రెడ్డి' చిత్రబృందంలోని సభ్యుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. లక్ష్మణ్ రావు అనే టెక్నీషియన్ ఆకస్మిక మరణంపై చిత్ర యూనిట్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. లక్ష్మణ్ రావు మృతిపై మంచు మనోజ్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో న్యాయం జరగాలంటూ సోషల్ మీడియా వేదికగా సంచలన పోస్టు పెట్టారు.

డేవిడ్ రెడ్డి చిత్రానికి డీవోపీ విభాగంలో లక్ష్మణ్ రావు టెక్నిషియన్‌గా పనిచేస్తున్నారు. అయితే ఆయన హఠాత్తుగా మరణించారు. ఈ వార్త తెలియగానే మంచు మనోజ్ ఎమోషనల్ అయ్యారు. టీమ్ మెంబర్‌ను కోల్పోవడం పట్ల ఆయన 'ఎక్స్' వేదికగా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. లక్ష్మణ్ రావు మరణం వెనుక ఎవరున్నా, నిందితులు ఎంతటి వారైనా వదిలి పెట్టకూడదని అన్నారు. వారిని చట్టం ముందు నిలబెట్టి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఏ నేరం కూడా చట్టం కళ్ళుగప్పి తప్పించుకోకూడదని పేర్కొన్నారు.

లక్ష్మణ్ రావుది సాధారణ మరణం కాదని, దీని వెనుక ఏదో మిస్టరీ దాగి ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని మంచు మనోజ్ పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళారు. లక్ష్మణ్ రావు మరణవార్త తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని, ఈ అనుమానాస్పద మృతి వెనుక అసలు కారణం బయటకు రావాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై ఎలాంటి ఒత్తిళ్లకు తావులేకుండా నిష్పక్షపాత దర్యాప్తు జరగాలని అన్నారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్ర డీజీపీలను మంచు మనోజ్ ట్యాగ్ చేశారు.
Go Back to Shorts
Manchu Manoj
David Reddy Movie
Lakshman Rao Death
Tollywood News
Suspicious Death
Police Investigation

More Telugu News