ప్రతికూల వాతావరణం కారణంగా హైదరాబాద్ కు రావాల్సిన రెండు విమానాల దారి మళ్లింపు
- హైదరాబాద్ శివార్లలో మేఘావృతమైన ఆకాశం
- లో విజిబిలిటీ కారణంగా విమానాల ల్యాండింగ్ కు ఇబ్బంది
- దుబాయ్ నుంచి వస్తున్న విమానం బెంగళూరుకు మళ్లింపు
హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా మారడం వల్ల శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది. నగర శివార్లలో ఆకాశం మేఘావృతమై, ల్యాండింగ్కు అవసరమైన స్పష్టత లేకపోవడంతో (Low Visibility), భద్రతా కారణాల దృష్ట్యా అధికారులు రెండు కీలక విమానాలను దారి మళ్లించారు.
పూణె - హైదరాబాద్ (ఇండిగో) విమానాన్ని విజయవాడలోని గన్నవరం ఎయిర్పోర్టుకు మళ్లించి అక్కడ సురక్షితంగా ల్యాండ్ చేయించారు. దుబాయ్ - హైదరాబాద్ (ఎమిరేట్స్) అంతర్జాతీయ విమానాన్ని బెంగళూరు విమానాశ్రయానికి డైవర్ట్ చేశారు. ఈ పరిణామాలతో ప్రయాణికులు చాలా ఇబ్బందికి గురయ్యారు. ఆ తర్వాత వాతావరణ పరిస్థితులు మెరుగుపడిన తర్వాత, ఈ రెండు విమానాలు తిరిగి శంషాబాద్ చేరుకోవడంతో ప్రయాణికులు, వారి కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.