బాలుడి హత్య కేసు: ట్రాన్స్జెండర్కు ఉరిశిక్ష.. ఆటో డ్రైవర్కు ఏడేళ్ల జైలు
- హైదరాబాద్లోని సనత్నగర్లో ఘటన
- చిట్టీ డబ్బుల వివాదమే హత్యకు ప్రధాన కారణం
- 2023లో జరిగిన హత్య కేసులో కోర్టు తీర్పు
- సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కేసును ఛేదించిన పోలీసులు
పోలీసుల కథనం ప్రకారం.. 2023 ఏప్రిల్ 20న ఈ దారుణం చోటుచేసుకుంది. బాలుడి తండ్రి వసీం ఖాన్కు, చిట్టీల వ్యాపారం చేసే ఇమ్రాన్కు మధ్య సుమారు రూ.7 లక్షల ఆర్థిక లావాదేవీల గొడవ ఉంది. ఈ కక్షతో వసీం ఖాన్ కుమారుడు అబ్దుల్ వహీద్ను ఇమ్రాన్ లక్ష్యంగా చేసుకుంది. రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉన్న బాలుడితో తనకు ఆరోగ్యం బాగోలేదని నమ్మించి ఓఆర్ఎస్ ప్యాకెట్ తెప్పించుకుంది. బాలుడు తిరిగి రాగానే గొంతు నులిమి హత్య చేసి, అనంతరం కాళ్లు, చేతుల ఎముకలు విరిచి మృతదేహాన్ని ఓ బకెట్లో కుక్కింది.
ఆ తర్వాత మృతదేహాన్ని పాలిథిన్ సంచిలో చుట్టి, ఆటో డ్రైవర్ రఫీక్ సహాయంతో ఫతేనగర్ సమీపంలోని నాలాలో పడేశారు. బాలుడి అదృశ్యంపై కేసు నమోదు చేసుకున్న సనత్నగర్ పోలీసులు, సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా ఇమ్రాన్ను అదుపులోకి తీసుకుని విచారించడంతో ఈ దారుణ హత్యోదంతం వెలుగులోకి వచ్చింది.
పక్కా ఆధారాలతో పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేయడంతో, విచారణ జరిపిన న్యాయమూర్తి మండవ వెంకటేశ్వరరావు.. ఇమ్రాన్కు ఉరిశిక్షతో పాటు రూ.10,000, రఫీక్కు ఏడేళ్ల జైలుతో పాటు రూ.1,000 జరిమానా విధించారు. ఈ తీర్పుపై బాలుడి తండ్రి వసీం ఖాన్ హర్షం వ్యక్తం చేస్తూ, తమకు న్యాయం జరిగిందని అన్నారు.