మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. లొంగిపోయిన కీలక నేత
- భార్యతో పాటు లొంగిపోయిన పసునూరి నరహరి అలియాస్ సంతోష్
- నరహరిది హనుమకొండ జిల్లా సోమిడి గ్రామం
- అగ్రనేతలు గణపతి, మిసిర్ బెస్ర కోసం కొనసాగుతున్న గాలింపు
మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు పసునూరి నరహరి అలియాస్ సంతోష్ సుమారు మూడు దశాబ్దాల అజ్ఞాత జీవితానికి స్వస్తి పలికి పోలీసుల ఎదుట లొంగిపోయారు. తెలంగాణలోని హనుమకొండ జిల్లా కాజీపేట మండలం సోమిడికి చెందిన నరహరి, 1996 నుంచి మావోయిస్టు పార్టీలో చురుగ్గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఝార్ఖండ్లోని సరండా అడవుల్లో భద్రతా బలగాలు పొలిట్ బ్యూరో సభ్యుడు మిసిర్ బెస్ర కోసం ముమ్మరంగా కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో నరహరి తన భార్యతో కలిసి పోలీసుల ఎదుట లొంగిపోయారు. గత 28 ఏళ్లుగా పార్టీలో పలు కీలక ఆపరేషన్లలో పాల్గొన్న ఆయన, కేంద్ర కమిటీ స్థాయికి ఎదిగారు.
నరహరి లొంగుబాటు పార్టీకి పెద్ద ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. ప్రస్తుతం మావోయిస్టు అగ్రనేతలు ముప్పాళ్ల లక్ష్మణరావు (గణపతి), మిసిర్ బెస్ర వంటి వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అటు చత్తీస్గఢ్, ఇటు ఝార్ఖండ్ సరిహద్దుల్లో బలగాల పహారా పెరగడంతో మరికొందరు నేతలు కూడా జనజీవన స్రవంతిలోకి వచ్చే అవకాశం ఉందని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి.