అమెరికా యుద్ధ నౌకల్లో సైనికులకు అరకొర భోజనం!

US Navy Sailors Face Food Shortages on Warships
  • ఇరాన్ సరిహద్దుల్లో మోహరించిన అమెరికా యుద్ధనౌకల్లో ఆహార కొరత
  • సరఫరాలు నిలిచిపోవడంతో సైనికులకు అరకొరగా భోజనం
  • సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేస్తున్న సైనికుల కుటుంబాలు
  • సైనికుల నైతిక స్థైర్యం దెబ్బతింటోందని నిపుణుల ఆందోళన
  • ట్రంప్ ప్రభుత్వ వైఫల్యమంటూ ప్రతిపక్షాల విమర్శలు
ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన సైన్యంగా చెప్పుకునే అమెరికా.. ప్రస్తుతం తన సైనికులకు కడుపునిండా తిండి పెట్టలేని పరిస్థితుల్లో చిక్కుకుందని వార్తలు వెలువడుతున్నాయి. ఇరాన్‌తో తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో పర్షియన్ గల్ఫ్, హిందూ మహాసముద్రంలో మోహరించిన యూఎస్ఎస్ అబ్రహం లింకన్, యూఎస్ఎస్ ట్రిపోలీ వంటి భారీ యుద్ధనౌకల్లో ఆహార సంక్షోభం తలెత్తిందని, సరిపడా ఆహారం అందక వేలాది మంది సైనికులు ఇబ్బందులు పడుతున్నారని తెలుస్తోంది.

ఈ నౌకల్లోని సైనికులకు అరకొరగా భోజనం అందుతోందని, ట్రేలు దాదాపు ఖాళీగా ఉంటున్నాయని నివేదికలు వస్తున్నాయి. తాజా పండ్లు, కూరగాయల సరఫరా నిలిచిపోవడంతో, కేవలం ఉడికించిన క్యారెట్లు, ప్రాసెస్ చేసిన మాంసంతోనే వారు సరిపెట్టుకోవాల్సి వస్తోంది. ఈ దుస్థితికి సంబంధించిన ఫోటోలు బయటకు రావడంతో సైనికుల కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ ఆవేదనను వెళ్లగక్కుతూ ప్రభుత్వంపై మండిపడుతున్నారు.

ఇరాన్ కీలకమైన సముద్ర మార్గం ‘స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్’ను దిగ్బంధించడంతో అమెరికా నౌకలకు సరఫరా గొలుసులో తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇదే ఈ ఆహార కొరతకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. వేలాది మంది సైనికులతో నిండిన యుద్ధనౌకల్లో ఇలాంటి పరిస్థితులు వారి నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తాయని రక్షణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఓవైపు ఇరాన్‌తో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న తరుణంలో, అమెరికా సైనికులు కనీస సౌకర్యాలకు దూరమవడం సంచలనంగా మారింది. ఈ వైఫల్యంపై ట్రంప్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. అత్యంత శక్తిమంతమైన సైన్యం తన సిబ్బందికి సరిపడా ఆహారం అందించలేకపోవడంపై అంతర్జాతీయంగా చర్చ జరుగుతోంది.
Go Back to Shorts
US Navy
USS Abraham Lincoln
USS Tripoli
Persian Gulf
Iran
Strait of Hormuz
food shortage
military
Trump administration
Indian Ocean

More Telugu News