మొదటి సారి ఎమ్మెల్యే అయిన తర్వాత బీపీ, రెండోసారి ఎమ్మెల్యే అయిన తర్వాత షుగర్ వచ్చాయి: రోజా
మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు ఆర్కే రోజా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తాను ఎదుర్కొన్న ఆరోగ్య సవాళ్లు, ప్రస్తుత రాజకీయ పరిణామాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పదవీకాలం పూర్తి చేసుకున్న వైసీపీ సర్పంచ్లను నగరిలోని తన నివాసంలో ఆమె సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
రాజకీయాలు అంటేనే మానసిక ఒత్తిడితో కూడుకున్నవని రోజా పేర్కొన్నారు. "మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు బీపీ సమస్య వచ్చింది. రెండోసారి గెలిచిన తర్వాత షుగర్ బారిన పడ్డాను" అని ఆమె తన వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితిని వివరించారు.
గత వైసీపీ పాలనలో జగన్ నేతృత్వంలో అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపించామని, ప్రజల మధ్య ఉంటూ సమస్యలు పరిష్కరించడం తమ పార్టీ సంస్కృతి అని చెప్పారు. ఎన్నికల సమయంలో కూటమి నేతల్లా తాము అబద్ధాలు చెప్పలేకపోయామని, అందుకే ఓటమి పాలయ్యామని ఆమె వ్యాఖ్యానించారు.
వైసీపీ సర్పంచ్లు గర్వంగా ప్రజల్లో తిరిగేలా పనులు చేశారని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మళ్లీ పార్టీ సత్తా చాటాలని పిలుపునిచ్చారు. అబద్ధాలతో గెలిచిన వారికి ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు. తమ పార్టీకి ఉన్న ప్రజాబలమే మళ్లీ తమను గెలిపిస్తుందని రోజా ఆశాభావం వ్యక్తం చేశారు.