మత్స్యకారుల మరణాలపై జగన్ శవ రాజకీయాలు చేస్తున్నారు... ఏ ముఖం పెట్టుకుని పరామర్శిస్తారు?: మంత్రి కొల్లు రవీంద్ర

Kollu Ravindra Slams Jagan Mohan Reddy Over Fishermen Deaths and Political Dramas
  • పరామర్శల పేరుతో జగన్ దొంగ నాటకాలు ఆడుతున్నారని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శ
  • విశాఖ పడవ ప్రమాద బాధితులకు 72 గంటల్లోనే రూ.10 లక్షల సాయం అందించిన ప్రభుత్వం
  • వైసీపీ హయాంలో 63 మత్స్యకార కుటుంబాలను పట్టించుకోలేదని ఆరోపణ
  • వేట నిషేధ భృతిని రూ.20 వేలకు పెంచి అందించిన కూటమి సర్కార్
  • జువ్వలదిన్నెలో చిచ్చుపెట్టాలని చూస్తే ఊరుకోబోమని జగన్‌కు హెచ్చరిక
ఐదేళ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజలను దారుణంగా మోసం చేసి, నట్టేట ముంచి, ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని పరామర్శల పేరుతో దొంగ నాటకాలు ఆడుతున్నారని వైసీపీ అధినేత జగన్ పై రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సోమవారం నాడు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మత్స్యకారుల కడుపు కొట్టి, వారి నోటికాడి కూడు లాక్కున్న జగన్ రెడ్డి.. ఇప్పుడు పెద్ద యోగ్యుడిలా పరామర్శల డ్రామాలు ఆడటం సిగ్గుచేటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

విశాఖపట్నం సముద్ర తీరంలో ఇటీవల జరిగిన పడవ ప్రమాదంపై ప్రభుత్వం తక్షణం స్పందించిందని కొల్లు రవీంద్ర తెలిపారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో నేవీ, కోస్ట్ గార్డ్ బృందాలను రంగంలోకి దించి గాలింపు చర్యలు చేపట్టామన్నారు. ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన మత్స్యకారుడు చిన్నా అందించిన సమాచారంతో 72 గంటల పాటు గాలించినా మిగతా ఆరుగురి ఆచూకీ లభించలేదన్నారు. 

కోస్ట్ గార్డ్, త్రీ-మెన్ కమిటీ నివేదికల ఆధారంగా వారు మరణించినట్లు నిర్ధారించి, కేవలం 72 గంటల వ్యవధిలోనే బాధిత కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెక్కులను అందించామని వివరించారు. భారతదేశ చరిత్రలోనే ఇంత వేగంగా సాయం అందించిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు.

ఇలాంటి దురదృష్టకర ఘటనను కూడా జగన్ రాజకీయం చేస్తున్నారని కొల్లు రవీంద్ర మండిపడ్డారు. "ప్రభుత్వం బాధితులకు కొండంత ధైర్యాన్నిస్తే.. మీరు శవ రాజకీయాలు చేయడానికి వెళ్తున్నారా?" అని ప్రశ్నించారు. 

గతంలో వైజాగ్ హార్బర్‌లో 45 బోట్లు కాలి బూడిదైతే కనీసం పలకరించని జగన్, ఇప్పుడు డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. తన ఐదేళ్ల పాలనలో 63 మంది మత్స్యకారులు సముద్రంలో గల్లంతై చనిపోతే, వారి కుటుంబాలకు డెత్ సర్టిఫికెట్లు కూడా ఇప్పించలేని దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి జగన్ అని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ 63 కుటుంబాలకు రూ. 3.15 కోట్ల సాయం అందించి ఆదుకుందన్నారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మత్స్యకారులకు అండగా నిలుస్తోందని రవీంద్ర వివరించారు. వేట నిషేధ భృతిని ఏకంగా రూ. 20,000కి పెంచి, రూ. 258 కోట్లకు పైగా నిధులను వారి ఖాతాల్లో జమ చేశామన్నారు. మత్స్యకారుల చెరువుల హక్కులను కాలరాసేందుకు జగన్ తెచ్చిన దుర్మార్గపు జీవో నెం. 217ను రద్దు చేశామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు రాష్ట్ర వాటా ఇవ్వకుండా నిర్వీర్యం చేసిన ఘనత జగన్‌కే దక్కుతుందని ఎద్దేవా చేశారు.

గతంలో హుద్‌హుద్ తుపాను సమయంలో చంద్రబాబు దెబ్బతిన్న బోట్లకు రూ. 6 లక్షల చొప్పున సాయం అందించారని, వేలమంది ఆక్వా రైతులను ఆదుకున్నారని గుర్తుచేశారు. మత్స్యకారుల రక్షణ కోసం 4,560 శాటిలైట్ ట్రాన్స్‌పాండర్లను ఉచితంగా అందించామని, 9 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాన్ని వేగవంతం చేశామని తెలిపారు. 

జువ్వలదిన్నె వంటి చోట్ల కులాల మధ్య చిచ్చులు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఐదేళ్ల పాలనలో మత్స్యకారులకు ఏం చేశారో దమ్ముంటే చర్చకు రావాలని జగన్‌కు సవాల్ విసిరారు. మత్స్యకారులకు ఏ మేలు జరిగినా అది తెలుగుదేశం, కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమైందని కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు.





Advertisement
Kollu Ravindra
Jagan Mohan Reddy
Andhra Pradesh Fishermen Deaths
Visakhapatnam Boat Accident
TDP YSRCP Politics
Fishermen Ex Gratia

More Telugu News