ఆమ్లెట్ గొడవ ప్రాణం తీసింది.. శ్రీకాకుళంలో అత్త వేధింపులతో కోడలు ఆత్మహత్య

Omelet dispute takes life Daughter in law commits suicide in Srikakulam due to harassment
  • అత్తాకోడళ్ల మధ్య తలెత్తిన చిన్న వివాదమే ప్రాణం తీసిన వైనం
  • అత్త వేధింపులు, భర్త మౌనం వహించడమే కారణం
  • తీవ్ర మనస్థాపంతో కోడలు ఉరేసుకుని బలవన్మరణం
  • కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు
శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అత్తాకోడళ్ల మధ్య తలెత్తిన ఓ చిన్న గొడవ చినికి చినికి గాలివానలా మారి, ఓ వివాహిత ప్రాణాలు తీసుకునేంత దారుణానికి దారితీసింది. ఆమ్లెట్ విషయంలో మొదలైన వివాదం, అత్త వేధింపులు, భర్త మద్దతు కరవవడంతో తీవ్ర మనస్థాపానికి గురైన యువతి బలవన్మరణానికి పాల్పడింది. ఈ హృదయ విదారక ఘటన శ్రీకాకుళం నగరంలోని ఆదివారంపేటలో జరిగింది.

పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. ఆదివారంపేటకు చెందిన కోనాడ నాగరాజు స్థానిక వస్త్ర దుకాణంలో సేల్స్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. అతనికి పొందూరు మండలం బొడ్డేపల్లికి చెందిన షర్మిల (26)తో ఏడాది క్రితం వివాహం జరిగింది. వివాహం తర్వాత దంపతులు ఉమ్మడి కుటుంబంతో కలిసి ఆదివారంపేటలోనే నివసిస్తున్నారు. అయితే, పెళ్లయిన నాటి నుంచి అత్త దమయంతికి, కోడలు షర్మిలకు మధ్య తరచూ చిన్న చిన్న విషయాలకే గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో భర్త నాగరాజు జోక్యం చేసుకోకుండా మౌనంగా ఉండేవాడని తెలుస్తోంది.

ఈ నెల 8వ తేదీన నాగరాజు పని ముగించుకుని ఇంటికి రాగా, భర్తకు భోజనం వడ్డిస్తూ షర్మిల ఒక ఆమ్లెట్ వేసి పెట్టింది. అయితే, తన చిన్న కొడుకుకు ఆమ్లెట్ ఎందుకు వేయలేదంటూ అత్త దమయంతి కోడలితో గొడవకు దిగింది. దీంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి పెద్ద వివాదంగా మారింది. ఆ సమయంలో కూడా నాగరాజు ఏమీ మాట్లాడకపోవడంతో షర్మిల తీవ్రంగా నొచ్చుకుంది. శనివారం కూడా ఇదే విషయమై ఇంట్లో మరోసారి గొడవ జరిగింది.

తరచూ అత్త వేధిస్తుండటం, చిన్న విషయానికే గొడవ పడుతుండటం, అన్నింటికన్నా ముఖ్యంగా కట్టుకున్న భర్త తనకు అండగా నిలబడకపోవడంతో షర్మిల తీవ్ర మనస్థాపానికి గురైంది. అందరూ నిద్రపోయిన తర్వాత అర్ధరాత్రి సమయంలో ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఉదయాన్నే షర్మిల విగతజీవిగా కనిపించడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కేవలం ఆమ్లెట్ కోసం మొదలైన గొడవ ఒకరి ప్రాణాన్ని బలిగొనడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
Advertisement
Sharmila
Srikakulam suicide
Mother in law harassment
Omelet dispute death
Adivarampeta Srikakulam
Family dispute tragedy

More Telugu News