షాబాద్ ఆరు మర్డర్ల కేసు నిందితుడు రాజ్కుమార్ మృతి
- కొత్తూరు మండలం పెంజర్లలో మృతదేహం లభ్యం
- మృతదేహం పక్కనే పాయిజన్ బాటిల్
- ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణ
- స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు
- మృతదేహం సమీపంలో విషం బాటిల్ లభ్యం
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షాబాద్ ఆరు మర్డర్ల కేసులో నిందితుడిగా ఉన్న రాజ్కుమార్ మృతి చెందాడు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పెంజర్ల గ్రామంలో ఓ వెంచర్ వద్ద అతని మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఈ గ్రామం అతని మేనమామ స్వగ్రామంగా తెలుస్తోంది.
రాజ్కుమార్ మృతదేహాన్ని గమనించిన స్థానికులు వెంటనే డయల్-100కు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పరిశీలించగా, మృతదేహం సమీపంలో విషం బాటిల్ కనిపించినట్లు సమాచారం.
రాజ్కుమార్ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక అనంతరం మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
జులై 10వ తేదీ అర్ధరాత్రి రాజ్కుమార్ ఆరుగురిని హత్య చేశాడు. అతడిపై ఈ ఏడాది మే 16న పోక్సో కేసు నమోదైంది. బెయిల్పై విడుదలైన అతడు మొదట తనపై ఈ కేసు పెట్టిన బాలిక తల్లి, నాయనమ్మలను చంపాడు. తరువాత బాలికను అక్కడ నుంచి దైవాలగూడ అనే మరో గ్రామానికి తీసుకువెళ్లి అక్కడ చెరువు దగ్గర ఆమెను గొంతుకోసి చంపాడు. తరువాత అదే గ్రామంలోని తన ఇంట్లో భార్య, ఇద్దరు పిల్లలను చంపాడు. అరగంటలో ఆరు హత్యలతో సంచలనం సృష్టించిన అతడి కోసం పోలీసులు 12 బృందాలతో తీవ్రస్తాయిలో వేట సాగించారు. అయితే, చివరికి అతడు ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది.