ఆంధ్రజ్యోతి ఆఫీస్ను తగలబెడతాం: వేమూరి రాధాకృష్ణపై రోజా తీవ్ర వ్యాఖ్యలు
హైదరాబాద్లోని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ నేతలు దాడికి యత్నించిన సంగతి తెలిసిందే. మరోవైపు తిరుపతిలో ఆంధ్రజ్యోతికి వ్యతిరేకంగా వైసీపీ శ్రేణులు నిరసన కార్యక్రమం చేపట్టాయి. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ... ఆ సంస్థ ఎండీ వేమూరి రాధాకృష్ణపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జర్నలిజం పేరుతో రాధాకృష్ణ బ్రోకరిజం చేస్తున్నారని, మహిళలను కించపరిచేలా వ్యవహరిస్తే ఊరుకోబోమని ఆమె హెచ్చరించారు.
రాధాకృష్ణ డొక్కు సైకిల్పై వచ్చి వేల కోట్లకు ఎలా ఎదిగారో అందరికీ తెలుసని రోజా అన్నారు. చంద్రబాబుకు బ్రోకర్గా పనులు చేస్తూ 'కొత్త పలుకు' పేరుతో కొవ్వెక్కి మాట్లాడుతున్నారని... ఆ కొవ్వును కరిగిస్తామని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ మహిళా నేతల గురించి, నాయకుల కుటుంబ సభ్యుల గురించి తప్పుగా రాస్తే చూస్తూ ఊరుకోబోమని, అవసరమైతే ఆంధ్రజ్యోతి కార్యాలయాన్ని తగలబెడతామని హెచ్చరించారు.
"మీరు తిట్టిస్తే... మాకు తిట్టడం రాక కాదు, మా సంస్కారం అడ్డు వస్తోంది. మేము తిట్టడం మొదలుపెడితే మీరు రోడ్లపై తిరగలేరు" అని కూటమి నేతలను ఉద్దేశించి రోజా అన్నారు. చంద్రబాబు రాయలసీమలో పుట్టి ఈ ప్రాంతానికే ద్రోహం చేస్తున్నారని విమర్శించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కోసం 2 వేల కోట్లు ఖర్చు చేయలేని వ్యక్తి, అమరావతికి 2 లక్షల కోట్లు ఎలా ఖర్చు చేస్తారని ప్రశ్నించారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో చంద్రబాబు చీకటి ఒప్పందాలు చేసుకుని ఏపీ ప్రయోజనాలను తాకట్టు పెట్టారని ఆరోపించారు. 87 శాతం పూర్తయిన రాయలసీమ ప్రాజెక్టులను నిలిపివేయడం అంటే ఈ ప్రాంత ప్రజల గొంతు కోయడమేనని, దీనిపై మహా ఉద్యమం చేస్తామని స్పష్టం చేశారు.