Chandrababu Naidu: హిట్ అండ్ రన్ నేరాల కంటే ఘోరంగా ఓ పార్టీ రాజకీయాలు చేస్తోంది: సీఎం చంద్రబాబు

Chandrababu Naidu Slams Political Attacks Worse Than Hit and Run
షార్ట్స్‌లో చూడండి
వైసీపీ తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు పరోక్షంగా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హిట్ అండ్ రన్ నేరాల కంటే ఘోరంగా ఓ పార్టీ రాజకీయాలు చేస్తోందని, కళ్లార్పకుండా అసత్యాలు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. నెల్లూరు జిల్లా వింజమూరులో జరిగిన 'పేదల సేవలో' కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో ఆయన ప్రసంగించారు. ప్రతిపక్షం చేస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని ఆయన కోరారు.

హిట్ అండ్ రన్ కంటే దారుణం
జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ విషయంలో వైసీపీ అసత్యాలు ప్రచారం చేస్తోందని చంద్రబాబు ఆరోపించారు. 2018-19లోనే తమ ప్రభుత్వం రూ.285 కోట్లతో హార్బర్ నిర్మాణానికి కేంద్రానికి ప్రతిపాదనలు పంపిందని గుర్తు చేశారు. కానీ, ఇప్పుడు ఆ వాస్తవాలను వక్రీకరించి దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కృష్ణపట్నం పోర్టును వాణిజ్యపరంగా మార్చినప్పుడు నాటి కాంగ్రెస్ పాలకులు పట్టించుకోలేదని అన్నారు. 

కూటమి ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధులు మత్స్యకారులకు ఎన్నడూ అన్యాయం చేయరని భరోసా ఇచ్చారు. ఏపీ జలాల్లోకి తమిళనాడు మత్స్యకారులు వచ్చి వేట చేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ విషయంలో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయాలని నెల్లూరు, తిరుపతి కలెక్టర్లకు వేదిక నుంచే చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

సంక్షేమ పథకాల వెల్లువ
ప్రజలపై ఉన్న అభిమానంతోనే తమ ప్రభుత్వం పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని చంద్రబాబు తెలిపారు. ప్రతి నెలా రూ.2,750 కోట్లను కేవలం పెన్షన్ల కోసమే వ్యయం చేస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ అని, పొరుగున ఉన్న తమిళనాడులో కేవలం రూ.1000 మాత్రమే ఇస్తున్నారని పోల్చి చెప్పారు. 

'తల్లికి వందనం' కింద గత ఏడాది అందించిన ఆర్థిక సాయాన్ని మళ్లీ జూన్‌లో ఆడబిడ్డల ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటించారు. 'దీపం 2.0' పథకం కింద ఏటా మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందిస్తున్నామని, త్వరలోనే పైపులైన్ల ద్వారా ఇంటింటికీ గ్యాస్ సరఫరా చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వివరించారు.

అభివృద్ధి, పెట్టుబడులే లక్ష్యం
సంక్షేమంతో పాటు రాష్ట్రాభివృద్ధికి కూడా తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం రూ.1300 కోట్లు అడ్వాన్స్‌గా ఇచ్చిందని, గోదావరి పుష్కరాల నాటికి ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి చెందుతోందని, రామాయపట్నం, దుగరాజపట్నం వంటి పోర్టులు రానున్నాయని తెలిపారు. 

ఉదయగిరిలో డ్రోన్లు, మానవ రహిత విమానాల తయారీ పరిశ్రమ రాబోతోందని, పెట్టుబడులకు ఏపీ గమ్యస్థానంగా మారిందని అన్నారు. ఇఫ్కో సెజ్ ద్వారా 80 వేల మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పారు.

సుపరిపాలన - చేనేతలకు వరం
సుపరిపాలన అందించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని చంద్రబాబు పునరుద్ఘాటించారు. ఈ మహాయజ్ఞానికి ఎవరు ఆటంకం కలిగించినా సహించేది లేదని, ప్రభుత్వ సేవల్లో లోపాలుంటే ఆకస్మిక తనిఖీలు చేస్తానని హెచ్చరించారు. డిసెంబరు నాటికి 4.5 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి గృహప్రవేశాలు చేయిస్తామన్నారు. 

ఈ సందర్భంగా, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు చేనేతలకు ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద 93 వేల చేనేత కుటుంబాలకు 200 యూనిట్లు, 11,443 పవర్‌లూమ్‌లకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని, ఇందుకోసం రూ.153 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. అనంతరం, లబ్ధిదారులకు ధ్రువపత్రాలు అందించారు. ఈ సందర్భంగా చేనేతలు సీఎంను నూలు దండతో సత్కరించారు.
Go Back to Shorts
Chandrababu Naidu
Andhra Pradesh
AP CM
YSRCP
Nellore
Welfare schemes
Fisheries
Polavaram Project
Free electricity
Weavers

More Telugu News