Perni Nani: జగన్ హయాంలోనే అమరావతిలో రోడ్ల నిర్మాణం జరిగింది: పేర్ని నాని
రాజధాని అమరావతిని చంద్రబాబు అప్పులకుప్పగా మార్చారని, కాంట్రాక్టర్ల దోపిడీ కోసం దీనిని ఒక 'ఏటీఎమ్'లా వాడుకుంటున్నారని మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని మండిపడ్డారు. ఇప్పటివరకు ఖర్చు చేసిన రూ. 21 వేల కోట్లపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన చట్టబద్ధత తీర్మానం కేవలం ఒక 'డ్రామా' అని, శాసనమండలి ఆమోదం లేకుండా కేవలం అసెంబ్లీ తీర్మానంతో చట్టబద్ధత ఎలా వస్తుందని ఆయన ప్రశ్నించారు. కూటమి నేతలు కేవలం జగన్ను తిట్టడానికే సమయాన్ని వృథా చేశారని ఆరోపించారు.
నిజానికి జగన్ హయాంలోనే అమరావతిలో రోడ్ల నిర్మాణం జరిగిందని, ఆయనకు రాజధానిపై కోపం ఉంటే తాడేపల్లిలో ఇల్లు ఎందుకు కట్టుకుంటారని నాని నిలదీశారు. అమరావతిలో పేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాలను రద్దు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం రాజధానిపైనే కాకుండా, ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా, కడప స్టీల్ ప్లాంట్, విశాఖ ఉక్కుకు సొంత గనుల కేటాయింపు వంటి అంశాలపై అసెంబ్లీలో తీర్మానాలు చేయాలని కూటమి ప్రభుత్వానికి ఆయన సవాల్ విసిరారు. అప్పుడే ప్రభుత్వానికి రాష్ట్రంపై చిత్తశుద్ధి ఉందని నమ్ముతామని స్పష్టం చేశారు.