Chandrababu Naidu: రాజధాని అమరావతికి చట్టబద్ధత.. అసెంబ్లీలో చారిత్రాత్మక తీర్మానాన్ని ప్రవేశపెట్టిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నేడు ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. రాజధాని అమరావతికి శాశ్వత చట్టబద్ధత కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. దీనికోసం, ఈ ఉదయం ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రత్యేకంగా సమావేశమైంది. సభ ప్రారంభం కాగానే ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తిస్తూ, దానికి చట్టబద్ధత కల్పించాలని కోరుతూ కీలక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. గత ఐదేళ్లుగా సాగుతున్న రాజధాని అనిశ్చితికి తెరదించి, ప్రజల్లో భరోసా నింపడమే ఈ తీర్మాన ప్రధాన ఉద్దేశ్యం.
అసెంబ్లీలో ఈ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించిన అనంతరం, దీనిని కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నారు. రాజ్యాంగబద్ధంగా అమరావతికి పూర్తిస్థాయి చట్టబద్ధత లభిస్తే, భవిష్యత్తులో రాజకీయ మార్పులు జరిగినప్పటికీ రాజధాని విషయంలో ఎటువంటి ఆటంకాలు కలగవని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ సందర్భంగా స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ.. ఏపీకి ఒక శాశ్వత రాజధాని నిర్మాణం అనేది రాష్ట్ర భవిష్యత్తుకు అత్యంత అవసరమని, ఆ సంకల్పంతోనే ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించారు. "ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధాని వంటి కీలక నిర్ణయాలు మారకూడదు. అది రాష్ట్ర అభివృద్ధికి గొడ్డలి పెట్టు" అని ఆయన అన్నారు. అమరావతి కేవలం ఒక నగరం మాత్రమే కాదని, అది ఐదు కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవ చిహ్నమని ఆయన పేర్కొన్నారు.