టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి వివాహం గురించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న వార్తలపై ఆమె వ్యక్తిగత బృందం 'టీమ్ అనుష్క' తీవ్రంగా స్పందించింది. ఒక వ్యాపారవేత్తతో అనుష్క పెళ్లి ఖాయమైందంటూ వస్తున్న కథనాలను ఖండిస్తూ, మీడియా సంస్థల తీరుపై మండిపడింది. కేవలం వ్యూస్, క్లిక్స్ కోసం ఒక నటి వ్యక్తిగత జీవితాన్ని బజారున పడేయడం సరికాదని హితవు పలికింది.
తాజా ప్రకటనలో టీమ్ అనుష్క ప్రధానంగా వయసు అంశాన్ని ప్రస్తావించింది. ప్రతి వార్తలోనూ అనుష్క వయసు '44 ఏళ్లు' అని ప్రత్యేకంగా హైలైట్ చేస్తూ చర్చించడాన్ని తప్పుబట్టింది. "వయసు అనేది నిజంగా చర్చించాల్సిన సమస్య అయితే, ఇదే ఉత్సాహం సీనియర్ హీరోల వయసు విషయంలో ఎందుకు కనిపించదు? కేవలం మహిళా నటీమణులనే టార్గెట్ చేయడం వివక్ష కాదా?" అని ఘాటుగా ప్రశ్నించింది.
అనుష్క తన సినీ కెరీర్ను కేవలం కష్టం, ప్రతిభతోనే నిర్మించుకున్నారని, ఆమె ఎప్పుడూ చీప్ పబ్లిసిటీ కోసం ప్రయత్నించలేదని టీమ్ గుర్తు చేసింది. ఒక నటిగా ఆమె సాధించిన విజయాలను పక్కన పెట్టి, కేవలం పెళ్లి, వయసు వంటి అంశాలనే హైలైట్ చేయడం అన్యాయమని పేర్కొంది. "వివాహం అనేది ఒక వ్యక్తిగత విషయం, అది బ్రేకింగ్ న్యూస్ కాదు. సోషల్ మీడియా ట్రెండ్ అసలే కాదు" అని స్పష్టం చేస్తూ, ఆమె వ్యక్తిగత గోప్యతను గౌరవించాలని విజ్ఞప్తి చేసింది.
ప్రస్తుతం అనుష్క తన తదుపరి సినిమాలతో బిజీగా ఉన్నారని, ఆమె వివాహానికి సంబంధించిన ఏ చిన్న విషయమైనా తామే అధికారికంగా వెల్లడిస్తామని టీమ్ ప్రకటించింది. అప్పటివరకు నిరాధారమైన వార్తలను, సోషల్ మీడియా ఊహాగానాలను నమ్మవద్దని అభిమానులకు సూచించింది. సినిమా ఇండస్ట్రీలో హీరోలకు ఇచ్చే గౌరవాన్ని హీరోయిన్లకు కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ చేసిన ఈ ప్రకటన ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.