Ravichandran Ashwin: మ్యాచ్ ఆడేందుకు సిద్ధంగా లేకపోతే.. మైదానంలోకి అడుగుపెట్టొద్దు: అశ్విన్
- దక్షిణాఫ్రికా చేతిలో భారత్ ఘోర పరాజయం
- వ్యూహరచనలో టీమిండియా పూర్తిగా విఫలమయిందన్న అశ్విన్
- అక్షర్ పటేల్ను ఆడించకపోవడంపై అసంతృప్తి
దక్షిణాఫ్రికా చేతిలో భారత జట్టు పరాజయం పాలైన నేపథ్యంలో, టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ జట్టు యాజమాన్యంపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. మ్యాచ్ ఆడేందుకు సరైన సన్నద్ధత లేకపోతే మైదానంలోకి అడుగుపెట్టకపోవడమే మంచిదని వ్యాఖ్యానించాడు. తన యూట్యూబ్ ఛానల్ వేదికగా ఈ ఓటమిని విశ్లేషించిన అశ్విన్, భారత జట్టు వ్యూహరచనలో పూర్తిగా విఫలమైందని, ఈ పరాజయం ఒక పెద్ద గుణపాఠం కావాలని అభిప్రాయపడ్డాడు.
ముఖ్యంగా తుది జట్టులో అక్షర్ పటేల్ను తీసుకోకపోవడంపై అశ్విన్ తీవ్రంగా స్పందించాడు. "ఐసీసీ ఈవెంట్లలో జట్లను మాటిమాటికీ మార్చకుండా స్థిరంగా ఉంచాలి. ప్రత్యర్థి జట్టులో లెఫ్ట్ హ్యాండర్ల కోసం వాషింగ్టన్ సుందర్ను తీసుకున్న నిర్ణయాన్ని నేను గౌరవిస్తాను. కానీ, టీ20ల్లో అక్షర్ పటేల్ అత్యంత విలువైన ఆటగాడు. గతంలో అతడు సాధించిన విజయాలను అంత త్వరగా ఎలా మర్చిపోతారు?" అని ప్రశ్నించాడు. ఆటగాళ్ల సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేయడం జట్టుకు నష్టమని సూచించాడు.
మరోవైపు, విధ్వంసకర బ్యాటర్ రింకు సింగ్ను బ్యాటింగ్ ఆర్డర్లో 8వ స్థానానికి పరిమితం చేయడాన్ని కూడా అశ్విన్ తప్పుబట్టాడు. జట్టులో ఎనిమిది మంది బ్యాటర్లు ఉన్నప్పటికీ, రింకు వంటి ప్లేయర్ను అంత వెనుకకు పంపడం సరైన వ్యూహం కాదన్నాడు. మొత్తం మీద జట్టు కూర్పు, బ్యాటింగ్ క్రమంపై అశ్విన్ చేసిన ఈ విశ్లేషణ ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.