Revanth Reddy: 'ఏఐ' ప్రత్యేక వార్ రూమ్ అవసరం.. హైదరాబాద్ అనువైన ప్రదేశం: ఏఐ సదస్సులో రేవంత్ రెడ్డి

Revanth Reddy Calls for AI War Room Hyderabad Ideal Location
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి వార్ రూమ్‌ను ఏర్పాటు చేయాలన్న ముఖ్యమంత్రి
  • ఏఐలో భారత్ గ్లోబల్ లీడర్‌గా ఎదగాలని ఆకాంక్ష
  • జీఎస్టీ కౌన్సిల్‌లా ఏఐ కౌన్సిల్ ఏర్పాటు చేయాలన్న రేవంత్ రెడ్డి
మన దేశంలో కృత్రిమ మేధ (ఏఐ) అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ప్రత్యేక వార్ రూమ్‌ను ఏర్పాటు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఏఐ పరిణామాలను పర్యవేక్షించడానికి, ఇతర అవసరాల కోసం వార్ రూమ్ అవసరమని, ఇలాంటి వార్ రూమ్ కోసం హైదరాబాద్ ఎంతో అనువైన ప్రదేశమని ఆయన అన్నారు. ఢిల్లీలో జరుగుతున్న ఏఐ సదస్సు-2026 సదస్సులో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, మనిషి కంటే కృత్రిమ మేధ (ఏఐ) ఎక్కువ తెలివితేటలు కలిగి ఉందని అన్నారు. ఏఐలో భారత్ గ్లోబల్ లీడర్‌గా ఎదగాలని ఆకాంక్షించారు. హైదరాబాద్‌లో ఏఐ వర్సిటీని ఇప్పటికే అన్ని వసతులతో ఏర్పాటు చేశామని వెల్లడించారు. హైదరాబాద్ వంటి నగరంలో ప్రతి ఆరు నెలలకోసారి ఏఐకి సంబంధించిన సదస్సులు జరగాలని అన్నారు. జీఎస్టీ కౌన్సిల్ తరహా 'ఏఐ' కౌన్సిల్‌ను ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు.

ఏఐ దుర్వినియోగం కాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు. హైదరాబాద్‌కు వచ్చి పెట్టుబడులు పెట్టాలని ముఖ్యమంత్రి టెక్ సంస్థలను కోరారు. ఏఐ రంగంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయని, వాటిని అందిపుచ్చుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ఏఐలో స్టార్టప్‌లను ప్రోత్సహించాలని అన్నారు. కృత్రిమ మేధను ఉపయోగించుకుంటే వ్యవసాయం సహా అన్ని రంగాలకు దోహదపడుతుందని పేర్కొన్నారు.

ఏఐ మానవ జీవితాల్లో పెను మార్పులు తీసుకువస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు. మనిషికి ఎన్నో పరిమితులు ఉండవచ్చని, అదే మనిషి సృష్టించిన ఏఐ ఫలితాలను మనం చూస్తూనే ఉన్నామని అన్నారు. గతంలో పారిశ్రామిక విప్లవం వచ్చిందని, ఇప్పుడు సాఫ్ట్‌వేర్ విప్లవం, ఏఐ శకం వచ్చిందని పేర్కొన్నారు. ప్రముఖ అంతర్జాతీయ కంపెనీలకు భారతీయులే సీఈవోలుగా ఉన్నారని గుర్తు చేశారు.
Revanth Reddy
Telangana
AI
Artificial Intelligence
Hyderabad
AI Summit 2026
AI War Room

More Telugu News