Nikhil Gupta: పన్నూన్ కేసులో సంచలనం.. నేరం ఒప్పుకున్న నిఖిల్ గుప్తాకు 40 ఏళ్ల జైలు?

అమెరికాలో ఖలిస్థానీ వేర్పాటువాది గుర్‍పత్వంత్ సింగ్ పన్నూన్‌ హత్యకు కుట్ర పన్నిన కేసులో ప్రధాన నిందితుడు, భారత జాతీయుడైన నిఖిల్ గుప్తా (54) తన నేరాన్ని అంగీకరించాడు. న్యూయార్క్‌లోని మన్‌హట్టన్ ఫెడరల్ కోర్టులో శుక్రవారం జరిగిన విచారణలో ఈ కీలక పరిణామం చోటుచేసుకుంది. గతంలో తాను నిర్దోషినని వాదించిన గుప్తా, ఇప్పుడు అనూహ్యంగా మాట మార్చడం సంచలనంగా మారింది.

ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం పన్నూన్‌ను హత్య చేసేందుకు నిఖిల్ గుప్తా లక్ష డాలర్లకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ క్రమంలో తాను కిరాయి హంతకుడు అనుకున్న వ్యక్తికి 15,000 డాలర్లు అడ్వాన్స్‌గా కూడా చెల్లించాడు. అయితే, గుప్తా సంప్రదించిన వ్యక్తి అమెరికా అధికారులకు సమాచారం అందించే వ్యక్తి కాగా, హంతకుడిగా నటించింది ఓ అండర్ కవర్ ఏజెంట్ కావడంతో ఈ కుట్ర భగ్నమైంది. "అమెరికాలో ఒక వ్యక్తిని హత్య చేయడానికి నేను మరో వ్యక్తితో కలిసి కుట్ర పన్నాను" అని గుప్తా న్యాయమూర్తి ముందు అంగీకరించాడు.

భారత ప్రభుత్వ అధికారి వికాశ్ యాదవ్ ఆదేశాల మేరకే తాను ఈ కుట్రకు పాల్పడినట్లు గుప్తా దర్యాప్తు సంస్థలకు వెల్లడించినట్లు ఆరోపణలు ఉన్నాయి. గత ఏడాది జూన్‌లో చెక్ రిపబ్లిక్‌లో అరెస్టయిన నిఖిల్ గుప్తాను, జూన్ 2024లో అమెరికాకు అప్పగించారు. హత్యకు కుట్ర, మనీలాండరింగ్ వంటి అభియోగాలపై గుప్తాకు గరిష్ఠంగా 40 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఈ కేసులో తుది తీర్పును మే 29, 2026న యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి విక్టర్ మారెరో వెలువరించనున్నారు.
Nikhil Gupta
Gurpatwant Singh Pannun
Khalistan
Vikash Yadav
US District Judge Victor Marrero
India
Czech Republic
Assassination Plot
Money Laundering
Manhattan Federal Court

More Telugu News