రాజకీయం అంటే సినిమా స్క్రిప్ట్ కాదు.. విజయ్కు శ్రీలంక ఎంపీ నామల్ రాజపక్స సూచన
- ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే అసలైన సవాలని విజయ్కు సూచన
- కచ్చతీవు అంశం రెండు దేశాల మధ్య ఒప్పందమన్న ఎంపీ
- దీనిని రాజకీయ ప్రచారాల కోణంలో చూడకూడదని వ్యాఖ్య
- శ్రీలంకను ఒక ప్రగతిశీల భాగస్వామిగా చూడాలని తమిళ నేతలకు పిలుపు
- తమిళనాడు వంటి రాష్ట్రాన్ని పాలించాలంటే నటనను పక్కనపెట్టి రాజకీయాలపైనే దృష్టి పెట్టాలని హితవు
విజయ్కు ఎలాంటి సలహా ఇస్తారని అడిగినప్పుడు.. "రాజకీయాలను సీరియస్గా తీసుకోండి. మీ నియోజకవర్గాన్ని, ప్రజలను అర్థం చేసుకోండి. మీరు నెరవేర్చగలిగే వాగ్దానాలు మాత్రమే ఇవ్వండి, వాటిని కచ్చితంగా అమలు చేయండి" అని రాజపక్స సమాధానమిచ్చారు. వెండితెరపై కనిపించే కథలకు, సామాన్యుడు ఎదుర్కొనే నిజ జీవిత సమస్యలకు చాలా వ్యత్యాసం ఉంటుందని, రాజకీయాల్లో 'రియాలిటీ చెక్' చాలా వేగంగా జరుగుతుందని హెచ్చరించారు.
విజయ్ తన ప్రసంగాల్లో కచ్చతీవు అంశాన్ని లేవనెత్తడంపై రాజపక్స స్పందిస్తూ.. ఇది రెండు దేశాల మధ్య జరిగిన ఒప్పందమని, ఇది శ్రీలంకలో భాగమని గుర్తుచేశారు. ఈ సమస్యపై నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వాల పరిధిలో ఉంటాయని, రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లో ఉండవని చెప్పారు. అలాగే, మత్స్యకారుల సమస్యకు ప్రధాన కారణం భారత మత్స్యకారులు శ్రీలంక జలాల్లోకి వచ్చి నిషేధిత పద్ధతుల్లో చేపల వేట సాగించడమేనని ఆయన అభిప్రాయపడ్డారు.
తమిళనాడు రాజకీయ నాయకులు శ్రీలంకను ఎప్పుడూ పాత రాజకీయ సున్నితత్వంతోనే చూస్తున్నారని, ఇకనైనా ఆ ధోరణి మారాలని రాజపక్స కోరారు. శ్రీలంక ఇప్పటికే పౌర యుద్ధం, సునామీ, ఆర్థిక సంక్షోభం వంటి ఎన్నో కష్టాలను చూసిందని.. ఇప్పుడు తమిళనాడు, భారత్లకు శ్రీలంకను ఒక అభివృద్ధి భాగస్వామిగా చూడాల్సిన సమయం వచ్చిందని రాజపక్స పేర్కొన్నారు.