Revanth Reddy: ఢిల్లీలో సోనియాను కలిసి విజన్ డాక్యుమెంట్ అందించిన సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddy Meets Sonia Gandhi Presents Vision Document
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం నాడు ఢిల్లీలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా 'తెలంగాణ రైజింగ్ 2047' విజన్ డాక్యుమెంట్‌ను ఆమెకు అందజేసి, రాష్ట్ర భవిష్యత్ ప్రణాళికలను వివరించారు.

గత రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, రాష్ట్ర అభివృద్ధికి తీసుకుంటున్న చర్యల గురించి సోనియా గాంధీకి సీఎం రేవంత్ రెడ్డి వివరించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) తెలిపింది. ఇటీవల డిసెంబర్ 8, 9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించిన 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025' వివరాలను కూడా ఆమెకు తెలిపారు.

ఈ సందర్భంగా తెలంగాణలో ప్రభుత్వ పనితీరు, రాష్ట్ర అభివృద్ధిపై రేవంత్ రెడ్డి దార్శనికతను సోనియా గాంధీ అభినందించారు. విజన్ డాక్యుమెంట్‌కు అనుగుణంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని ఆకాంక్షిస్తూ, ముఖ్యమంత్రికి తన శుభాకాంక్షలు తెలియజేశారు.

ఏమిటీ విజన్ డాక్యుమెంట్?

'తెలంగాణ రైజింగ్-2047' విజన్ డాక్యుమెంట్ ప్రకారం, రాష్ట్రాన్ని 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనిలో భాగంగా 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల మైలురాయిని చేరుకోవాలని నిర్దేశించుకున్నారు. ఈ లక్ష్యాలను సాధించేందుకు రాష్ట్రాన్ని క్యూర్ (కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ), ప్యూర్ (పెరి అర్బన్ రీజియన్ ఎకానమీ), రేర్ (రూరల్ అగ్రి రీజియన్ ఎకానమీ) అనే మూడు ప్రత్యేక జోన్లుగా విభజించి అభివృద్ధి చేయనున్నారు.

ఇటీవల జరిగిన గ్లోబల్ సమ్మిట్‌కు సోనియా గాంధీ సందేశం పంపుతూ, తెలంగాణను 2034 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు ఈ సదస్సు ఒక పెద్ద ముందడుగు అవుతుందని ఆశాభావం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
Go Back to Shorts
Revanth Reddy
Sonia Gandhi
Telangana
Telangana Rising 2047
Vision Document
Congress
Telangana Economy
Global Summit
3 Trillion Dollar Economy
Bharat Future City

More Telugu News