నా పిల్లలకు డీఎన్ఏ టెస్ట్ చేయించండి: ప్రభుత్వానికి బ్రహ్మంగారి మఠం మాజీ పీఠాధిపతి భార్య విజ్ఞప్తి
- బ్రహ్మంగారి మఠంలో మరోసారి భగ్గుమన్న విభేదాలు
- సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారన్న మారుతీ మహాలక్ష్మమ్మ
- సెల్ఫీ వీడియో విడుదల చేసి ఆవేదన వ్యక్తం చేసిన మారుతీ మహాలక్ష్మమ్మ
- గత నాలుగేళ్లుగా ఫిర్యాదు చేసినా చర్యలు లేవంటూ ఆరోపణ
గత నాలుగేళ్లుగా తమ ప్రత్యర్థులు సోషల్ మీడియా వేదికగా తన వ్యక్తిత్వాన్ని హననం చేసేలా అసభ్యకర పోస్టులు పెడుతున్నారని మారుతీ మహాలక్ష్మమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు పోలీసులకు, ప్రభుత్వ పెద్దలకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోకపోవడంతో వారి వేధింపులు మితిమీరిపోయాయని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి సహా ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి జోక్యం చేసుకుని తనకు న్యాయం చేయాలని కోరారు.
కొన్ని రోజుల క్రితం కూడా ఈ వేధింపులు భరించలేనని, తనను రాళ్లతో కొట్టి చంపేందుకు ప్రత్యర్థులకు అనుమతి ఇవ్వాలంటూ ఆమె ఆవేదనతో ప్రభుత్వాన్ని కోరారు. కడప జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో, చివరకు ఒక తల్లిగా తన పిల్లల పితృత్వాన్ని తేల్చమని ప్రభుత్వాన్ని అభ్యర్థించడం హాట్ టాపిక్ అయింది.